TSPSC పేపర్ లీక్ ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్ - రేవంత్ కు సిట్ నోటీసులు..!!
పబ్లిక్ సర్వీసు కమిషన్ ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్. రేవంత్ కు సిట్ నోటీసులు.
తెలంగాణలో సంచలనంగా మారిన పబ్లిక్ సర్వీసు కమిషన్ ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్. రాజకీయ నేతలపైన సిట్ ఫోకస్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఇద్దరు ఉద్యోగులతో పాటుగా సహకరించిన వారిని సిట్ విచారిస్తోంది. ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది. ప్రశ్నాపత్రాలు టీఎస్పీఎస్సీలో పని చేసే వారి ద్వారానే బయటకు వెళ్లినట్లు గుర్తించారు. అటు ఇదే సమయంలో హైకోర్టులోనూ ఈ వ్యవహారంపై పిటీషన్ దాఖలైంది. ప్రభుత్వం తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని..పారదర్శకంగా వ్యవహరిస్తామని చెబుతోంది.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. వ్యవహారంలో నిందితులను విచారిస్తున్న సిట్..రాజకీయంగా ఆరోపణలు చేస్తున్న వారి పైన ఫోకస్ చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేసారు. మంత్రి కేటీఆర్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మంత్రి కేటీఆర్ వద్ద పని చేసే వ్యక్తి సొంత గ్రామంలో పరీక్షల్లో వంద మందికి మంచి మార్కులు వచ్చాయని ఆరోపించారు. ఇప్పటికే ప్రభుత్వం సున్నితమైన ఈ అంశంలో రాజకీయాల కోసం ఆరోపణలు చేసి..ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న యువతని ఇబ్బంది పెట్టవద్దని సూచించింది. ఇప్పుడు సిట్ నేరుగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఆరోపించినట్లుగా ఎవరెవరికి ఇందులో భాగస్వామ్యం ఉంది.. ఎటువంటి ఆధారాలు ఉన్నాయో వాటితో సహా హాజరు కావాలని పేర్కొంది.

రేవంత్ రెడ్డితో పాటుగా ఇదే తరహాలో ఆరోపణలు చేస్తున్న రాజకీయ నేతలను సిట్ విచారించే అవకాశం కనిపిస్తోంది. ఎవరి దగ్గర ఎటువంటి సమాచారం ఉన్నా..తమకు ఇవ్వాలని కోరుతోంది. దీంతో...ఇతర పార్టీ ల నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇటు పేపర్ లీక్ కేసులో నిందితులను సిట్ విచారించింది. పేపర్ లీక్ కేసులో 9 మంది నిందితులను సిట్ అధికారులు మూడో రోజు విచారిస్తున్నారు. అధికారులు నిందితుల లావాదేవీలపై కూపీ లాగుతున్నారు. రాజశేఖర్ రెడ్డి , ప్రవీణ్, రేణుక వీళ్ల మధ్య జరిగిన ట్రాన్సక్షన్స్ గురించి ఆరా తీస్తున్నారు. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు పేపర్ ఎవరెవరు తీసుకున్నారో వారిని గుర్తించి కేసులు నమోదు చేయనుంది.
ఎవరెరవరితో చాటింగ్ చేశారనే వివరాలతో పాటుగా కాల్ లిస్టు ఆధారంగా సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును హైకోర్ట్ మార్చి 21కి వాయిదా వేసింది. పేపర్ లీక్ కేసును సీబీఐకి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ ఎన్ఎస్ యూఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ హైకోర్ట్ లో పిటిషన్ వేశారు. విచారణ సమయంలో మార్చి 21కి పిటిషన్ ను వాయిదా వేయాలని బల్మూరి వెంకట్ తరపు న్యాయవాది కరుణాకర్ కోర్టును కోరారు. సుప్రీం కోర్టు న్యాయవాది కాంగ్రెస్ లీగల్ సెల్ అధ్యక్షులు వివేక్ ధన్కా వాదనలు వినిపిస్తారని కోర్టుకు తెలిపారు. అటు రేవంత్ ఇంకా తనకు ఎటువంటి నోటీసులు అందలేదని స్పష్టం చేసారు. నోటీసులు అందితే స్పందిస్తానని చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications