ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ లో బిగ్ అప్డేట్.. కార్మికుడి మృతదేహం గుర్తింపు
నాగర్కర్నూల్ జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర విషాదం నింపింది. సొరంగం తవ్వకాల్లో ప్రమాదం చోటుచేసుకుని ఎనిమిది మంది కూరుకుపోయి మరణించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గత 16 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. అయితే ఈరోజు గల్లంతైన వారిని గుర్తించడంలో పురోగతి లభించింది. సొరంగంలో ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 పాయింట్లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించాయి.
జాగిలాలు గుర్తించిన ప్రాంతంలో తవ్వకాలు చేపట్టిన కార్మికులకు 6 అడుగుల లోతులో ఓ వ్యక్తికి చెందిన కుడి చేయి కనిపించింది. దీంతో అప్రమత్తమైన కార్మికులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని వెలికి తీసేందుకు దాని చుట్టూ రెండు అడుగుల మేర మరో ఆరడుగుల లోతులో గొయ్యి తవ్వేందుకు యత్నిస్తున్నారు. గల్లంతైన వారిలో కొందరిని నేడు సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇక మృతదేహం పూర్తిగా కాంక్రీట్లో కూరుకుపోయి ఉన్నట్లు తెలుస్తోంది. డ్రిల్లింగ్ ద్వారానే శరీరాలను బయటికి తీసేందుకు సాధ్యమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఆనవాళ్లు లభించడాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దాదాపు 130 మందికి పైగా ఈ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నట్టు సమాచారం.
మరోవైపు టన్నెల్లో మినీ జేసీబీలతో శిథిలాలు తొలగిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాగా.. టన్నెల్ ఎండ్ పాయింట్ సమీపంలో TBM మిషన్ ముందు భాగం పూర్తిగా బురదలో కూరుకుపోయింది. అలానే TBM మిషన్ వెనుకభాగం శకలాల తొలగింపు వేగంగా సాగుతుండగా.. రెండు మినీ ప్రొక్లెయిన్స్ ఉపయోగించి రెస్క్యూ టీం శకలాలు తొలగిస్తున్నారు.
ప్రమాదస్థలం వద్ద సహాయక చర్యలపై ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సమీక్ష నిర్వహించారు. టన్నెల్ మెుత్తం పొడవు 14కి.మీ కాగా.. 13.950 మీటర్ల వరకు క్లియర్గా ఉందని అధికారులు స్పష్టం చేశారు. జీరో పాయింట్ వద్ద చివరి 50 మీటర్లు సంక్లిష్టంగా ఉందని వెల్లడించారు. రెస్క్యూలో భాగంగా రోబోల సహాయంతో సహాయక చర్యలు చేపట్టాలని చూస్తున్నామని వివరించారు. ఆచూకీ తెలియకుండా పోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు. అలానే ఈనెల 11న సీఎం స్థాయిలో మరోసారి ప్రమాద ఘటన, సహాయక చర్యలపై రివ్యూ ఉంటుందని ఆదేశించారు.












Click it and Unblock the Notifications