ఏం జరుగుతోంది?: ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బీజేపీ అధిష్టానం పిలుపు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ఆ పార్టీ అధిష్టానం కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రాష్ట్ర పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలపై బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలు ఆరా తీశారు. ఈ నేపథ్యంలోనే సీనియర్ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఢిల్లీకి రావాలని ఆదేశించారు.
ఈ క్రమంలో ఈటల, రాజగోపాల్ రెడ్డి ఈరోజు లేదా రేపు అంటే శనివారం ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఇటీవల పార్టీ కార్యక్రమాలకు ఈ ఇద్దరు నేతలు కూడా దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. రాష్ట్ర పార్టీ నేతల మధ్య భేదాభిప్రాయాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు నేతలను ఢిల్లీకి పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ రాజకీయ నేతలపైనా పడినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో కొంత జోష్ రాగా.. బీజేపీలో మాత్రం కొత్తగా చేరికలు లేకపోవడంతో కొంత డీలపడినట్లు కనిపిస్తోంది. కానీ, బీజేపీ నేతలు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలతో పార్టీని ప్రజల వద్దకు తీసుకెళుతున్నారు. కేంద్రమంత్రులు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు.
అయితే, ఇక పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్గా ఉన్న ఈటల రాజేందర్ తోపాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తోపాటు ఇతర సీనియర్ నేతలను కూడా పిలిపించుకుని మాట్లాడాలని బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయించింది. నాయకుల మధ్య బేధాభిప్రాయాలు లేకుండా చేసి తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ అధిష్టానం రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
కర్ణాటక ఫలితాలకు ముందు బీజేపీలో చేరతారనుకున్న ఖమ్మం కీలక నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కొంత సమస్యకు దారితీసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications