బండి సంజయ్ ఆరో విడత యాత్రకు బీజేపీ హైకమాండ్ గ్రీన్సిగ్నల్: 18 నుంచే!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరవ విడత ప్రజా సంగ్రామ యాత్రకు ఆ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో జనవరి 18 నుంచి యాత్రను ప్రారంభించేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఆరవ విడత పాదయాత్రను 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. కొడంగల్ నుంచి నిజామాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించేందుకు అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. రాష్ట్ర నాయకత్వం రూట్ మ్యాప్ను రూపొందించేందుకు కసరత్తులు ప్రారంభించింది.

ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుండటంతో తెలంగాణ వ్యాప్తంగా యాత్రను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా పాదయాత్రను కొనసాగించాలని బండి సంజయ్ ను కోరుతున్నారు. దీంతో అధిష్టానం కూడా బండి సంజయ్ యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా శ్రేణులంతా పనిచేయాలని బండి సంజయ్ పిలుపునిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ కేంద్రంగా జరిగిన బీజేపీ బూత్ కమిటీ సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారడంతో ఆ పార్టీకి తెలంగాణకు బంధం తెగిపోయిందన్నారు. సీఎం కేసీఆర్ ఇక్కడ దుకాణం మూసేసి ఇంకోదాన్ని తెరిచారన్నారు. టీఆర్ఎస్ శాంతిభద్రతల సమస్యను సృష్టించి బీజేపీ మీద వేయాలని చూస్తోందని ఆరోపించారు. పాతబస్తీ, ఖైరతాబాద్ మాత్రమే కాదు.. తెలంగాణ మొత్తం బీజేపీ వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications