ముగ్గురు కేంద్ర మంత్రుల సాక్షిగా బీజేపీ నన్ను అవమానించింది.!కమల శ్రేణులపై మండిపడ్డ మంత్రి వేముల.!
హైదరాబాద్ : నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధికారిక సభలో బీజేపీ కార్యకర్తల, నాయకుల వ్యవహార శైలి పై రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రుల నివాస సముదాయంలోని ఆయన అధికారిక నివాసంలో మీడియాతో మాట్లాడుతూ బీజేపి కార్యకర్తల వ్యవహారాన్ని ఎండగట్టారు.
ప్రభుత్వ మీటింగ్ కి బీజేపీ కార్యకర్తలను తరలించారని, తాను ప్రభుత్వం తరుపున మాట్లాడుతుంటే బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తూ అడ్డుపడడం ఎంతవరకు సమంజసమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు.
ప్రభుత్వ కార్యక్రమమా.?పార్టీ కార్యక్రమమా.?
ముగ్గురు కేంద్ర మంత్రుల సాక్షిగా బీజేపీ కార్యకర్తలు చిల్లరగా వ్యవహరించి తెలంగాణ ప్రతిష్టను మంటగలిపారని, మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నీచమైన కేంద్ర బీజేపీలో తనకు కనిపించిన ఏకైక మంచి మనిషి నితిన్ గడ్కరీ అని పేర్కొన్నారు. రహదారుల అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాలని గడ్కరీ లేఖ రాస్తే రాష్ట్ర ప్రభుత్వం తరుపున రోడ్లు భవనాలు శాఖ మంత్రిగా తాను వెళ్ళానని, తెలంగాణ పురోగమిస్తున్న రాష్ట్రమని నితిన్ గడ్కరీ స్వమంగా తన ప్రసంగంలో స్పష్టం చేరాని వేముల గుర్తు చేసారు. ప్రభుత్వ కార్యక్రమం అని నేషనల్ హైవే అథారిటీ అధికారులు తమకు స్పష్టం చేసిన అంశాన్ని మంత్రి వేముల వివరించారు.
తనను అవమానించడం సరికాదు..
ఒక్కో కార్పొరేటర్ కు వెయ్యి మందిని తీసుకొని రావాలని బీజేపీ భాద్యతలు ఇచ్చినట్లు తెలిసిందని, బీజేపీ కండువాలు వేసుకోని ప్రభుత్వ కార్యక్రమంలో 3వేల మంది పాల్గొన్నారని, తాను ప్రసంగిస్తున్న సమయంలో కాషాయ కండువా వేసుకున్న బీజేపీ కార్యకర్తలు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారని అన్నారు. హైవేలను కేంద్రం బాధ్యతగా ఇస్తుందని, రాష్ట్రం బాధ్యతగా అడుగుతుందన్నారు వేముల.
తాను మాట్లాడితే అంత ఉలికిపాటు ఎందుకని, 8వేల కోట్లు గిఫ్ట్ గా ఇస్తున్నాం అనడం మంచి సంప్రదాయం కాదన్నారు వేముల. అన్ని రాష్ట్రాలకు ఇస్తున్న తరహాలోనే తెలంగాణకు ఇస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ప్రోగ్రాంను బిజెపి పార్టీ కార్యక్రమంలాగా మార్చివేసారని, బీజేపీ ఏమైనా చెప్పాలనుకుంటే లక్ష మందితో సభ పెట్టుకొని చెప్పుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని వేముల అన్నారు.
బీజేపి కార్యకర్తల దిగజారుడు వ్యవహారం..
తన ఉపన్యాసాన్ని అడ్డుకోవాలని ముందే అనుకొని నినాదాలు ఇచ్చారని, కేంద్రం రాష్ట్రానికి పెద్దగా ఇచ్చింది ఏముందని, ఏడేళ్ల కాలంలో 7లక్షల కోట్ల బడ్జెట్ లో తెలంగాణకు ఇచ్చింది ఎంత?అని వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. 8వేల కోట్లకు ఇంత చిల్లరగా వ్యవహరిస్తారా? తనను ఆపినంత మాత్రాన నిజాలు ఆగకుండా ఉంటాయా? కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను అడుగుతానని భయంతో తన స్పీచ్ ను అడ్డుకున్నారని, బీజేపీ కార్యకర్తలు బజారు రౌడీలా వ్యవహరిస్తున్నారని, కార్యకర్తలు చేసిన చిల్లర వ్యవహారానికి కేంద్రమంత్రి నాకు క్షమాపణ చెప్పారన్నారు వేముల ప్రశాంత్ రెడ్డి.
ఏపి మంత్రుల కామెంట్స్..
ఏపి మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం అంతా హైదరాబాద్ లోనే ఉంటుందని, మంత్రి కేటీఆర్ ఆంద్రప్రదేశ్ గురించి వాస్తవాలు మాత్రమే మాట్లాడారని అన్నారు. ఏపీ నాయకులు రెచ్చగొట్టే మాటలు మాట్లాడారు కాబట్టే తెలంగాణ వచ్చిందని అన్నారు.
ఆంద్రప్రదేశ్ ను అభివృద్ధి చేసుకుంటే తాము అడ్డుపడుతామా? విజయవాడ నుంచి రియలేస్టేట్ వ్యాపారులు అంతా తెలంగాణకు వస్తున్న అంశం అక్కడి మంత్రులకు కనిపించడం లేదా?అని వేముల ప్రశ్నించారు. టీఆరెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో రోడ్లు బాగున్నాయా లేదా అనేది ప్రజలకు తెలుసన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.