మీరు మాత్రం తక్కువా: బీజేపీపై కేటీఆర్ చేసిన విమర్శలకు అనూహ్యంగా షర్మిల ఘాటు కౌంటర్
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు ఏ కారణంతో ప్రజా ఆగ్రహ సభను నిర్వహించారో గానీ.. దాని ఉద్దేశం మాత్రం నెరవేరనట్టే కనిపిస్తోంది. పైగా మరంత చులకన కావాల్సి వచ్చింది. లేని వివాదాలను కొని తెచ్చుకున్నట్టయింది ఏపీ బీజేపీ నాయకుల పరిస్థితి. ఎప్పుడూ లేనివిధంగా ఏపీ బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు పేరు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆయన పేరు వైరల్గా మారింది. జాతీయ మీడియా సైతం ఆయన ప్రసంగానికి ప్రాధాన్యత ఇచ్చింది.

మాటల యుద్ధం..
చీప్ లిక్కర్ మీద సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు మాటల యుద్ధానికి దారి తీసింది. సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల తప్పు పట్టారు. బీజేపీ-టీఆర్ఎస్ దొందు దొందేనని మండిపడ్డారు. మద్యం విషయంలో ఈ రెండు పార్టీలు జనాలను మోసం చేస్తోన్నాయని ధ్వజమెత్తారు.

సోషల్ మీడియాలో వైరల్గా..
2024లో తాము అధికారంలోకి వస్తే.. చీప్ లిక్కర్ను 70 రూపాయలకే ఇస్తామని సోము వీర్రాజు చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. తమ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ఆర్థిక పరిస్థితి బాగుంటే 50 రూపాయలకే చీప్ లిక్కర్ ఇస్తామనీ చెప్పుకొచ్చారాయన. రాష్ట్రంలో కోటిమంది తాగుతున్నారని, వారంతా బీజేపీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడీ క్లిప్పింగ్ వైరల్గా మారింది. సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. వందల సంఖ్యలో ట్వీట్లు, రీట్వీట్లు పడుతున్నాయి..దీనిమీద.

తప్పు పట్టిన కేటీఆర్..
దీనిపై తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. వహ్..వాట్ ఎ షేమ్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఏపీ బీజేపీ సరికొత్తగా మరింత దిగజారిపోయిందని ఎద్దేవా చేశారు. 50 రూపాయలకే చీప్ లిక్కర్ను సరఫరా చేయాలనేది బీజేపీ జాతీయ విధానంగా పెట్టుకుందా లేక ఎలాగూ అధికారంలోకి రాదని నిరాశలో కూరుకుపోయిన రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేశారా అని ప్రశ్నించారు.

తలదించుకునేలా ఉన్నాయంటూ..
అధికారంలోకి రాలేమని తెలుసుకున్న రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీ 50 రూపాయలకు చీప్ లిక్కర్ ఇచ్చేలా జాతీయ విధానాన్ని రూపొందించుకుందని చురకలు అంటించారు. జాతీయ పార్టీకి రాష్ట్రశాఖ అధ్యక్షుడి హోదాలో సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని ధ్వజమెత్తారు. ఈ మేరకు సోము వీర్రాజు చీప్ లిక్కర్ కామెంట్స్ వీడియోను యాడ్ చేసిన ఓ ట్వీట్కు తన అభిప్రాయాలను జత చేసి రీట్వీట్ చేశారు.

కేటీఆర్-సోములకు షర్మిల కౌంటర్
కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల కౌంటర్ అటాక్ చేశారు. రెండు పార్టీలనూ ఏకి పారేశారు. సోము వీర్రాజును తప్పుపడుతూ కేటీఆర్ చేసిన ట్వీట్కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. బీజేపీ చీప్ లిక్కర్.. టీఆర్ఎస్ కాస్ట్లీ లిక్కర్ అంటూ వ్యాఖ్యానించారు. అన్ని చోట్లా మద్యాన్ని పారించడమే టీఆర్ఎస్ విధానమని మండిపడ్డారు. మద్యం పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం జనాన్ని దోచుకుంటోందని ధ్వజమెత్తారు.
యువతను మద్యానికి బానిస..
ప్రజలను- ప్రత్యేకించి యువతను మద్యానికి బానిస చేయడమే టీఆర్ఎస్ విధానంగా కనిపిస్తోందని వైఎస్ షర్మిల విమర్శించారు. మహిళల భద్రతను ఎప్పుడో గాలికి వదిలేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గరుండి, బలవంతంగా ప్రజలతో మద్యాన్ని తాగిస్తోందని ధ్వజమెత్తారు. ప్రతి పాఠశాల పక్కనా లిక్కర్ షాపులను అందుబాటులోకి తెచ్చిందని, ప్రతి గ్రామంలోనూ మద్యం ఏరులై పారిస్తోందని అన్నారు. మద్యం పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల రక్తాన్ని తాగుతోందని అన్నారు.












Click it and Unblock the Notifications