నేడు తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల
బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. ప్రచార జోరు పెరిగింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో.. అన్ని ప్రధాన పార్టీలు జనంలోకి వెళ్లాయి. ఇంటింటినీ పలకరిస్తోన్నాయి. రోడ్ షోలు, బహిరంగ సభలతో హోరెత్తిస్తోన్నాయి.
తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ 30వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మిజోరంలల్లో అదే రోజు ఓట్లను లెక్కిస్తారు. రాజెవరు? బంటు ఎవరు? అనేది తేలిది అప్పుడే.

ఈ క్రమంలో బీజేపీ గేరు మార్చింది. జనసేనతో పొత్తు ఖరారు చేసుకుంది. ఉమ్మడి అభ్యర్థులను బరిలోకి దించనుంది. జనసేనకు సీట్ల పంపకాల ప్రక్రియను పూర్తి చేసింది. అదే సమయంలో ఈ నెల 7వ తేదీన భారీ బహిరంగ సభను నిర్వహించబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ స్థాయి నాయకులు ఈ సభకు హాజరు కానున్నారు. దీని తరువాత పోలింగ్ సమయానికి మూడు నుంచి అయిదుచోట్ల మోదీ సభలను ఏర్పాటు చేయాలని తెలంగాణ బీజేపీ నిర్ణయించింది.
మిత్రపక్షం జనసేనతో పొత్తు ఖరారైన నేపథ్యంలో.. ఆ పార్టీకి సీట్లను కేటాయించింది. కూకట్పల్లి, ఖమ్మం, నాగర్కర్నూలు, కొత్తగూడెం, అశ్వారావుపేట, వైరా, మధిర నియోజకవర్గాల్లో బీజేపీ- జనసేన ఉమ్మడి అభ్యర్థులు పోటీ చేస్తారు. మరో స్థానం ఇంకా ఖరారు కాలేదు. శేరిలింగంపల్లి కోసం జనసేన పట్టుబట్టుతున్నట్లు తెలుస్తోంది.
జనసేనతో సీట్ల పంపకాలు కొలిక్కి నేపథ్యంలో- ఇక తన అభ్యర్థుల తుదిజాబితాపై కసరత్తు పూర్తి చేస్తోంది బీజేపీ. ఇప్పటివరకు 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 31లో జనసేనకు తొమ్మిది కేటాయించింది. అవి పోగా మిగిలిన 22 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను నేడు విడుదల చేసే అవకాశం ఉంది.
ఇప్పటికే ఆయా చోట్ల అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చిందని, జనసేనతో సీట్ల పంపకాలు ముగియడం వల్ల తాము పోటీ చేసే స్థానాలపై స్పష్టత ఏర్పడిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 7వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ నాటికి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని స్పష్టం చేస్తోన్నాయి.












Click it and Unblock the Notifications