ఓటుకు నోటుతో కార్నర్: వరంగల్ సీట్లో టిడిపితో బిజెపి కటీఫ్
హైదరాబాద్: తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వరంగల్ లోకసభ స్తానానికి ఒంటరిగా పోటీ చేయాలని ఆ పార్టీ భావిస్తోంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి రాజీనామా చేయడంతో వరంగల్ లోకసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది.
నోటుకు ఓటు కేసులో పీకల లోతు మునిగిపోయిన తెలుగుదేశం పార్టీ సహకారంతో వరంగల్ లోకసభ స్థానంలో పోటీ చేయకూడదని బిజెపి నాయకులు భావిస్తున్నారు. ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. వరంగల్ లోకసభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభా నియోజకవర్గాలకు చెందిన నాయకులు ఆదివారంనాడు బిజెపి తెలంగాణ రాష్ట్ర నాయకులను కలిశారు.
బిజెపి తెలంగాణ రాష్ట్రాధ్యక్షుడు జి. కిషన్ రెడ్డిని, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయను వారు కలిసి, వరంగల్ లోకసభ ఉప ఎన్నికపై చర్చించారు. నోటుకు ఓటు కేసు వల్ల పరువు పోగొట్టుకున్న టిడిపితో కలిసి నడిస్తే వ్యతిరేక ఫలితం రావచ్చునని బిజెపి నాయకులు భావిస్తున్నారు. ఈ స్థితిలో ఒంటిరగానే పోటీ చేయాలని వారు భావిస్తున్నారు.
కాగా, తెలంగాణలో స్వతంత్రంగా ఎదగాలనే ఆలోచనతో బిజెపి జాతీయ నాయకులు కూడా ఉన్నారు. దీంతో వరంగల్ లోకసభ స్థానానికి ఒంటరిగా పోటీ చేసే రాష్ట్ర నాయకుల ఆలోచనకు వారు కూడా మద్దతు పలికినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పటి వరకు అభ్యర్థిని మాత్రం ఖరారు చేయలేదు. వరంగల్ లోకసభ స్థానం విషయంలో టిడిపి ఏం చేస్తుందనే విషయం తెలియడం లేదు.