టీఆర్ఎస్ ప్రభుత్వం కూలడం ఖాయం... బీజేపీపై కోపాన్ని రైతులపై చూపిస్తావా ? : కేసీఆర్కు ఈటల వార్నింగ్
తెలంగాణలో వడ్ల రాజకీయం మరోసారి హీటెక్కిస్తోంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్పై మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. బీజేపీపై ఉన్న కోపాన్ని రైతులపై చూపిస్తున్నారంటూ మండిపడ్డారు. ధాన్యం పండించి బీజేపీ పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్ల ముందు పోస్తామని సీఎం కేసీఆర్ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ ప్రభుత్వం కుప్ప కూలడం ఖాయం
పార్టీ ఆఫీసులు మీద దాడులు, ధర్నాలు చేయిస్తారా ? అని టీఆర్ఎస్ నేతలపై ఈటల నిప్పులు చెరిగారు. హుజారాబాద్ ఎన్నికలతోనే కేసీఆర్ పతనం మొదలైందన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ ప్రభుత్వం కుప్పకూలిపోవడం ఖాయమని హెచ్చరించారు. ధాన్యం సేకరణపై కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. మోసపూరిత మాటలతో రైతాంగాన్ని గందరగోళంలో పడేస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం సేకరణకు అవసరమైన డబ్బులను కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. రాష్ర ప్రభుత్వం కేవలం ఒక ఏజెన్సీలా మాత్రమే పనిచేస్తుందని మండిపడ్డారు.

ధాన్యం కొనుగోళ్లలో చేతకానితనంతో కేసీఆర్..
తెలంగాణలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని కేంద్రం ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదని ఈటల పేర్కొన్నారు. టీఆఎస్ నేతలు కావాలనే దీనిని రాజకీయం చేస్తూ కొత్త డ్రామాలు ఆడుతున్నారని విరుచుకుపడ్డారు. వరి వేయొద్దంటే రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లలో చేతకానితనంతో కేసీఆర్ వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. 30 లక్షల ఎకరాల్లో ధాన్యాన్నే కొనలేదని ముఖ్యమంత్రి.. కోటి ఎకరాల్లో ధాన్యం పండిస్తే.. పరిస్థితేంటి అని ఈటెల నిలదీశారు.

3రాబోయేది బీజేపీ ప్రభుత్వమే
తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం బీజేపీ కృషి చేస్తుందని ఈటల అన్నారు. ధాన్యం సేకరణ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు.. ఇది దశాబ్దాలుగా కొనసాగుతోందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు గుణపాఠం తప్పదన్నారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలను భయటకు వస్తున్నాయన్నారు. అందుకే ప్రజలను మభ్యపెట్టేందుకు రోజుకో కొత్త డ్రామాను తెరపైకి తెస్తున్నారని ద్వజమెత్తారు. లేని సమస్యను ఉన్నట్లు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని ఈటల ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతి పంటను కొనుగోలు చేస్తామని ఈటల స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications