రేవంత్ ప్రభుత్వం అప్పటి వరకే, తరువాత మేమే - బీజేపీ నేత సంచలనం..!!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరుతోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటికే మంత్రుల జాబితా సిద్దమైంది. ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో పాటుగా పార్టీ ముఖ్యులు...తెలుగు రాష్ట్రాల్లోని ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నారు. ఇదే సమయంలో రేవంత్ ప్రభుత్వం గురించి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు గురించి ప్రస్తావించారు.
మరి కొద్ది గంటల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ సమయంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏడాది తరువాత రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ రోజులు ప్రభుత్వాన్ని నడపలేదని చెప్పుకొచ్చారు. ఒక్క ఏడాది మాత్రమే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేసిన అప్పులు..లెక్కలు సరి చేయటానికే కాంగ్రెస్ కు సమయం సరిపోతుందని పేర్కొన్నారు. ఇక..కాంగ్రెస్ ఇచ్చిన గ్యాంరెటీల అమలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

తెలంగాణలో ఏడాది తరువాత వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పారు. రాజ్యాంగాన్ని మారుస్తానన్న కేసీఆర్ నే తెలంగాణ ప్రజలు మార్చేశారని రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తెలంగాణలో బీజేపీ ఈ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ మెజార్టీ కంటే నాలుగు సీట్లను మాత్రమే అధికంగా గెలుచుకుంది. సీపీఐ ఒక సీటు గెలిచి కాంగ్రెస్ కు మద్దతిస్తోంది. బీఆర్ఎస్ 39 స్థానాల్లో విజయం సాధించింది. ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరుతున్న సమయంలో రాజాసింగ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటంతో ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది. అదే విధంగా అన్ని పార్టీల నేతలను రేవంత్ తన ప్రమాణ స్వీకారినికి ఆహ్వానిస్తున్న వేళ...ఎవరెవరు హాజరవుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications