Hydra: పేదవారి ఇళ్లను కూల్చుతారా.. ఈటల ఫైర్..
మూసీ ప్రక్షాళన చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించాలని నిర్ణయించింది. అయితే బాధితులకు డబుల్ బెడ్ రూం ఇస్తామని ప్రకటించింది. దీంతో ఆక్రమణలకు మార్కింగ్ చేసే పనిని అధికారులకు అప్పగించింది. దీంతో అధికారులు పోలీసుల బందోబస్త్ మధ్య మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఆక్రమణాల్లో మార్కింగ్ చేస్తున్నారు.
మార్కింగ్ ను యజమానులు వ్యతిరేకిస్తున్నారు. నిరసన ర్యాలీలు కొనసాగుతోన్నాయి. అధికారులు బృందాలుగా ఏర్పడి గోల్కొండ, ఇబ్రహీంబాగ్, లంగర్ హౌజ్ డిఫెన్స్ కాలనీ, పాతబస్తీ, చాదర్ఘాట్, శంకర్ నగర్, అంబర్పేట్, ముసారాంబాగ్, కొత్తపేట, మారుతీనగర్, సత్యానగర్, ఫణిగిరికాలనీ, ఇందిరానగర్, గణేష్పురిలో మార్కింగ్ చేస్తున్నారు. బాధితులకు బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మద్దతుగా నిలిచారు.

పరిశీలనకు వెళ్లిన ఆయనకు బాధితులు తమ బాధలు చెప్పుకున్నారు. తము ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని.. ఇప్పుడు వచ్చి కూల్చేసి ఎక్కడో ఇళ్లు ఇస్తామని చెబుతున్నారని ఈటలకు వివరించారు. తమకు ఇక్కడ ఉపాధి ఉందని.. ఇతర ప్రాంతాలకు వెళ్తే తమ ఉపాధి దెబ్బ తింటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఈటల స్పందించారు. పేదవారి కన్నీరు ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహిస్తున్నారని అన్నారు.
కూల్చివేతలతో చాలా మంది ఆందోళన చెందుతున్నారని తెలిపారు. గతంలో సంజయ్ గాంధీ కూడా ఇలాగే నిరుపేదల ఇళ్లను కూల్చివేశారని గుర్తు చేశారు. ఈ విషయమై ప్రభుత్వం మరోసారి ఆలోచించాలన్నారు. లేకుంటే ప్రజల మద్దతుగా పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications