కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే; కేంద్రాన్ని బద్నాం చెయ్యటానికే డ్రామాలు : భగ్గుమన్న బీజేపీ ఎంపీలు
తెలంగాణ రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలుపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య రగడ కొనసాగుతోంది. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ మంత్రులను ఢిల్లీకి పంపి కేంద్ర మంత్రులను కలిసి ధాన్యం కొనుగోలు చేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇక ఇదే సమయంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కెసిఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ రాష్ట్రం నుంచి రా రైస్ కొంటున్నామని వెల్లడించారు. కానీ టిఆర్ఎస్ పార్టీ నేతలు మాత్రం ఢిల్లీ నుంచి గల్లీ దాకా యాసంగి ధాన్యం కొనుగోళ్లకు కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ ఆందోళనలకు రెడీ అవుతున్నారు.
కేసీఆర్ చెబుతున్నవన్నీ అబద్దాలే : ఎంపీ ధర్మపురి అరవింద్
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యల తర్వాత ధాన్యం కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నవన్నీ అబద్ధాలని పీయూష్ గోయల్ వ్యాఖ్యలతో తేటతెల్లమైందని ఎంపీ ధర్మపురి అరవింద్ వెల్లడించారు. తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ ఎంపీలు కేంద్రంపై దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. టిఆర్ఎస్ పార్టీని జనం అసహ్యించుకుంటున్నా సీఎం కేసీఆర్ వైఖరి లో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదని ఎంపీ ధర్మపురి అరవింద్ పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడమే కెసిఆర్ పనిగా పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు.
కేసీఆర్ వల్లే తెలంగాణా రైతాంగానికి కష్టాలు
కెసిఆర్ చర్యలు రాష్ట్ర రైతాంగాన్ని నట్టేట ముంచేలా ఉన్నాయని ధర్మపురి అరవింద్ వెల్లడించారు. టిఆర్ఎస్ పార్టీ ఓ అబద్దాల ఫ్యాక్టరీ అంటూ మండిపడ్డారు. అసలు తెలంగాణ రాష్ట్రం నుండి ఎంతధాన్యం పంపిస్తారని ఇంతవరకు కేంద్రానికి వివరాలు పంపకపోవడం దారుణమని ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. కేంద్రానికి ఇవ్వాల్సిన బియ్యం ఏనాడు సకాలంలో ఇవ్వని చరిత్ర కెసిఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 2019-2020 సంవత్సరానికి గాను తెలంగాణ నుంచి రావాల్సిన లక్ష మెట్రిక్ ల బియ్యాన్ని నేటికి కేంద్రానికి పంపక పోవడం దారుణమని ధర్మపురి అరవింద్ వెల్లడించారు.
కేంద్రాన్ని బద్నాం చెయ్యటం కోసమే కేసీఆర్ డ్రామాలు: సోయం బాపూరావు
ఇక ఇదే సమయంలో బీజేపీ ఎంపీ సోయం బాపూరావు తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రాన్ని బదనాం చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడిన డ్రామాలన్నీ బట్టబయలు అయ్యాయని పేర్కొన్నారు. ధాన్యం సేకరణ విషయంలో పంజాబ్ మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలోనూ బియ్యాన్ని సేకరిస్తున్నారని పేర్కొన్న సోయం బాపూరావు దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలులో ఉందని వెల్లడించారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు టిఆర్ఎస్ పార్టీకి చెంప పెట్టువంటిదని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు పేర్కొన్నారు.
కెసిఆర్, టిఆర్ఎస్ పార్టీ పునాదులు కదులుతున్నాయి: సోయం బాపూరావు
తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయడం కోసం కెసిఆర్ కొత్త డ్రామాలకు తెర తీశారని మండిపడ్డారు. ధాన్యం సేకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకుంటూ తెలంగాణ రైతాంగాన్ని మానసిక క్షోభకు గురి చేస్తుందని సోయం బాపురావు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా బీజేపీ తిరుగులేని రాజకీయ శక్తిగా తయారవుతున్న నేపథ్యంలో కెసిఆర్ కు భయం పట్టుకుందని పేర్కొన్న సోయం బాపూరావు కెసిఆర్, టిఆర్ఎస్ పార్టీ పునాదులు కదులుతున్నాయి అంటూ వ్యాఖ్యానించారు.
కేసీఆర్ తప్పును ఒప్పుకుని క్షమాపణలు చెప్పాలి: బీజేపీ ఎంపీ సోయం బాపూరావు
కావాలని కెసిఆర్ రైతులకు బీజేపీకి మధ్య తగువు పెట్టాలని ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. కెసిఆర్ ఆడుతున్న అబద్ధాలను ప్రజలు నమ్మడం లేదని సోయం బాపూరావు వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన తప్పును ఒప్పుకుని తక్షణమే రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సోయం బాపురావు పేర్కొన్నారు. లేని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేంత వరకూ బిజెపి వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.