టీఆర్ఎస్కు వ్యతిరేక పవనాలు.. బీజేపీ వైపు ప్రజల చూపు : మురళీధర్ రావు
మహబూబ్నగర్ : టీఆర్ఎస్ పార్టీని పక్కా ప్లాన్డ్గా ఎదుర్కొనే పార్టీ ఏదైనా ఉందంటే.. అది బీజేపీయేనని స్పష్టం చేశారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు. దేశ రాజకీయ చరిత్ర చూసినట్లయితే.. నిరంతర ప్రజా భాగస్వామ్యాన్ని పెంచేందుకు బీజేపీ ఒక్కటే కృషి చేస్తోందని వ్యాఖ్యానించారు. సోమవారం నాడు మహబూబ్ నగర్లో మీడియా సమావేశంలో మాట్లాడిన మురళీధర్ రావు ఆసక్తికర అంశాలు ప్రస్తావించారు.
టీఆర్ఎస్ పట్ల ప్రజల్లో రోజురోజుకీ వ్యతిరేకత పెరిగిపోతోందని.. ఆ క్రమంలో ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ వైపు చూస్తున్నారని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో 36 లక్షల మందిని సభ్యులుగా చేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. కుల, వర్గాలకు అతీతంగా బీజేపీ పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. ఇక దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పుంజుకునే అవకాశం లేదని.. తెలంగాణలో ప్రతిపక్షంగా విఫలమైన ఆ పార్టీ చివరికి టీఆర్ఎస్ జేబు పార్టీగా మారిందని ఆరోపించారు.

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఏమి చేయలేదనే ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. ఏమి చేయకుంటే 7 శాతం జీడీపీ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. ఇక తెలంగాణ ప్రభుత్వం పేదోళ్లకు ఇళ్లు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. రైతులకు ఫసల్ బీమా యోజన ఎందుకు అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. అదలావుంటే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రగతి రిపోర్టుపై చర్చకు సిద్ధమని ప్రకటించారు.
ప్రజోపయోగ పనులు చేయడమే బీజేపీ ధ్యేయమన్నారు మురళీధర్ రావు. ఇంటింటికీ మరుగుదొడ్డి, కరెంట్ సౌకర్యం కల్పించడమే ప్రధాని మోడీ లక్ష్యమని తెలిపారు. రానున్న ఐదేళ్లలో రోడ్ల కోసం వంద లక్షల కోట్ల రూపాయలు.. రైల్వే లైన్ల కోసం 50 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పుకొచ్చారు.
2022 నాటికి ప్రతి కుటుంబానికి రక్షిత మంచినీరు పథకం అందించాలనేది మోడీ ఆకాంక్ష అని వివరించారు.












Click it and Unblock the Notifications