బండి సంజయ్ పోరాటం భేష్; అరెస్ట్ తీరు దారుణం: బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఫైర్
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పక్షాన 317 జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన దీక్షను ఆదివారం రాత్రి పోలీసులు భగ్నం చేసిన విషయం తెలిసిందే. కరీంనగర్లోని బిజెపి కార్యాలయంలో జాగరణ దీక్ష చేపట్టిన బండి సంజయ్ కరోనా నిబంధనలకు విరుద్ధంగా దీక్ష చేపట్టారు అంటూ నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బండి సంజయ్ అరెస్ట్ పై స్పందించారు.

బండి సంజయ్ చేస్తున్న పోరాటం భేష్: జేపీ నడ్డా
అంతకుముందు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుపై ఆరా తీశారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా . ఫోన్ చేసిన ఆయనకు బండి సంజయ్ పోలీస్ కస్టడీలో ఉన్న విషయాన్ని తెలియజేశారు బండి సంజయ్ సిబ్బంది . ఈ క్రమంలో ఉపాధ్యాయుల పక్షాన, ఉద్యోగుల పక్షాన బండి సంజయ్ చేస్తున్న పోరాటం భేష్ అంటూ మెచ్చుకున్న జేపీ నడ్డా, బిజెపి నాయకులు, కార్యకర్తలపై పోలీసులు దాడి, అరెస్టుల తదనంతర పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. టిఆర్ఎస్ అకృత్యాలకు అప్రజాస్వామిక చర్యలకు భయపడవద్దని పేర్కొన్నారు జేపీ నడ్డా.

భౌతికంగా దాడి చేశారని జేపీ నడ్డా ఆరోపణ
తలుపులు పగలగొట్టి భౌతికంగా దాడి చేశారని ఆరోపించిన జేపీ నడ్డా, సొంత కార్యాలయంలో దీక్ష చేస్తున్నా సాకులతో బండి సంజయ్ ను అరెస్టు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాశకాలే విపరీత బుద్ది అన్నట్టు కెసిఆర్ సర్కార్ వ్యవహరిస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉపాధ్యాయుల తరఫున బిజెపి పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు. కేసీఆర్ సర్కార్ పై న్యాయపోరాటం కొనసాగిస్తామని, కేసీఆర్ ను ఓడిస్తామని, సత్యం కోసం పోరాటం చేస్తామని జేపీ నడ్డా తేల్చిచెప్పారు.

బండి సంజయ్ వెనుక జాతీయ నాయకత్వం ఉందని, భయం వద్దన్న నడ్డా
టీచర్లు ఉద్యోగులకు, న్యాయం జరిగేంత వరకూ బిజెపి అండగా ఉంటుంది అంటూ భరోసా ఇచ్చారు. బండి సంజయ్ వెనుక జాతీయ నాయకత్వం ఉందని, ఇదే విధంగా ప్రజా సమస్యల పైన పోరాటం చేయాలని జేపీ నడ్డా సూచించారు. తెలంగాణ ప్రజలకు కావలసిన అన్ని రకాల సహాయ సహకారాలను తాము అందిస్తామని జేపీ నడ్డా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని, బలవంతంగా బండి సంజయ్ కార్యాలయంలోకి వెళ్లి అరెస్టు చేశారని మండిపడ్డారు. బీజేపీ నేతలు కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారని ఆరోపించారు.

బండి సంజయ్ కు 14 రోజుల డిమాండ్..
తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని, బలవంతంగా బండి సంజయ్ కార్యాలయంలోకి వెళ్లి అరెస్టు చేశారని మండిపడ్డారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారని ఆరోపించారు. ఇదిలా ఉంటే బండి సంజయ్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచిన నేపథ్యంలో పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేసిన క్రమంలో బండి సంజయ్ సహా ఐదుగురికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. బెయిల్ కోసం బండి సంజయ్ ప్రయత్నం చేసినప్పటికీ కోర్టు ఆయన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. కోర్టు తీర్పు అనంతరం బండి సంజయ్ ను కరీంనగర్ జైలుకు తరలించారు. బెయిల్ కోసం జిల్లా కోర్టును బండి సంజయ్ ఆశ్రయించనున్నట్లు గా తెలుస్తోంది












Click it and Unblock the Notifications