టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్: బీజేపీXటీఆర్ఎస్
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ వ్యవహారం పైన శాసనసభలో శనివారం వాదోపవాదాలు జరిగియి. అధికారపక్షం తీరుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాయి. వారంపాటు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయడాన్ని కాంగ్రెస్, బీజేపీ సభ్యులు తీవ్రంగా నిరసించారు.
సభతో సంబంధంలేని వ్యక్తిపై విమర్శలు చేస్తే సభ నుంచి సస్పెండ్ చేయడం ఏమిటని కాంగ్రెస్ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేయగా మునుపెన్నడూలేని రీతిలో ఓ పార్టీకి సంబంధించిన సభ్యులను వారం పాటు సస్పెండ్ చేయడంపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ప్రతిపక్షాల విమర్శలకు అధికారపక్షం కూడా అదే స్థాయిలో సమాధానమివ్వడంతో శనివారం నాటి శాసనసభా సమావేశాలు వాడివేడిగా జరిగాయి.
శనివారం ఉదయం ప్రశ్నోత్తరాలను పూర్తి చేసి జీరో అవర్ ప్రకటించిన స్పీకర్ మధుసూదనా చారి సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. బీజేపీ పక్ష నేత డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ... టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసి సభను నడిపించడం బాగాలేదని, ఇది తప్పుడు సంకేతాలను పంపిస్తుందన్నారు. వెంటనే వారి సస్పెన్షన్ను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డిమాట్లాడుతూ.. సస్పెండ్ అయినా ఆ సభ్యుడికి కొంచెమైనా పశ్చాత్తాపం లేదని, బయట మరింత విపరీత ధోరణిలో మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో గవర్నర్ విద్యాసాగర్ రావు పట్ల అనుచితంగా ప్రవర్తించిన సభ్యులను అక్కడి బీజేపీ ప్రభుత్వం రెండేళ్లపాటు అసెంబ్లీనుంచి సస్పెండ్ చేసిందని, ఇక్కడ తాము వారం పాటు సస్పెండ్ చేస్తే తప్పొచ్చిందా అన్నారు.
తర్వాత బీజేపీ సభ్యుడు కిషన్ రెడ్డి మాట్లాడుతూ... టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసి మూడు రోజులైందని, ఆ సస్పెన్షన్ ఎత్తివేత అంశాన్ని పరిశీలించాలంటూ తాము సూచన చేస్తే అధికార పక్షం బుల్డోజ్ చేస్తోందన్నారు. విద్యుత్ సమస్యకో, లేక రైతుల ఆత్మహత్యలకో సంబంధించి మాట్లాడితే సస్పెండ్ చేస్తే ఏమో అనుకోవచ్చునని, కానీ సభకు సంబంధం లేని ఒక ఎంపీపై మాట్లాడితే సస్పెండ్ చేస్తారా? అన్నారు.