రోహిత్ వేములపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు-ఐదేళ్ల నాటి ఘటనపై మళ్లీ చిచ్చు-క్షమాపణకు డిమాండ్
ఐదేళ్ల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేములపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రేమలో విఫలమవడం వల్లే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్నాడని సీటీ రవి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహిత్ ఆత్మహత్యను అడ్డుపెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా కుట్ర పన్నారని ఆయన ఆరోపించారు. సీటీ రవి చేసిన ఈ వ్యాఖ్యలపై రోహిత్ వేముల సోదరుడు,న్యాయవాది రాజా వేముల తీవ్ర స్థాయిలో స్పందించారు. రోహిత్ వేముల ఆత్మహత్యపై నిరాధార ఆరోపణలు చేసినందుకు సీటీ రవి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సీటీ రవి ఏమన్నారు...
'ప్రేమలో విఫలమైన ఓ వ్యక్తి చనిపోయినప్పుడు... బీజేపీ దళిత వ్యతిరేక పార్టీ అని,అసహనపూరిత పార్టీ అని వాళ్లు అన్నారు. ఆ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి పేరు రోహిత్ వేముల. ప్రేమలో విఫలమవడం వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ అతని ఆత్మహత్యను అడ్డుపెట్టుకుని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా.. ఆత్మహత్యకు ఆయన్నే బాధ్యుడిని చేసేలా కొంతమంది కుట్రలు యత్నించారు.' అని సీటీ రవి వ్యాఖ్యానించారు.

బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే : రాజా వేముల
సీటీ రవి వ్యాఖ్యలను రోహిత్ వేముల సోదరుడు రాజా వేముల తీవ్రంగా ఖండించారు. తన సోదరుడి ఆత్మహత్యపై నిరాధార ఆరోపణలు చేసినందుకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.'సీటీ రవి చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించమని నేను డిమాండ్ చేస్తున్నా.ఒకవేళ సీటీ రవి ఆధారాలు చూపించకపోతే రోహిత్ వేముల కుటుంబంతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి బహిరంగ క్షమాపణలు చెప్పాలి. అసలు యూనివర్సిటీలో ఏం జరిగిందో ఆయనకేమీ తెలియదు. మా జీవితాల పట్ల ఆయనకు అవగాహన లేదు.'అని రాజా వేముల వ్యాఖ్యానించారు.

అప్పట్లో దేశాన్ని కుదిపేసిన ఘటన...
దళిత సామాజికవర్గానికి చెందిన పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జనవరి 17,2016న ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లోని విద్యార్థులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. లోక్సభలోనూ దీనిపై వాడి వేడి చర్చ జరిగింది. రోహిత్ది వ్యవస్థీకృత హత్య అని విద్యార్థి సంఘాలు,ప్రజా సంఘాలు,పలు విపక్ష పార్టీలు ఆరోపించగా... రోహిత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని రైట్ వింగ్ సంఘాలు,పార్టీలు బలంగా వాదించాయి.

రోహిత్ ఆత్మహత్య వెనుక...
సెంట్రల్ యూనివర్సిటీలో అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఎస్ఏ)కు,బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీకి మధ్య జరుగుతున్న గొడవల్లో రాజకీయ నేతలు తలదూర్చడం వల్లే రోహిత్ వేముల,మరికొందరు విద్యార్థులు అప్పట్లో బహిష్కరణకు గురయ్యారన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా అప్పటి కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ స్మృతీ ఇరానీకి రాసిన లేఖ అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఆయన రాసిన లేఖ వల్లే రోహిత్ వర్సిటీ నుంచి బహిష్కరణకు గురయ్యాడన్న ఆరోపణలు వినిపించాయి. అన్యాయంగా తమపై వేటు వేశారన్న కారణంతో రోహిత్,అతని మిత్ర బృందం వెలివాడ పేరుతో క్యాంపస్లోనే నిరసన చేపట్టారు. తమకు న్యాయం జరగాలని పోరాడుతున్న క్రమంలోనే రోహిత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. అయితే రోహిత్ వేములది ఆత్మహత్యేనని పోస్టుమార్టమ్ నివేదిక వెల్లడించింది.












Click it and Unblock the Notifications