కాంగ్రెస్తో పొత్తుకు కేసీఆర్ తహతహ.. రాహుల్ గాంధీపై ప్రేమను అందుకే ?
తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక మాట అంటే తాము నాలుగు మాటలు అంటాం.. ఇందులో తగ్గేదేలే అంటున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు. సర్జికల్ స్ట్రైక్పై అనుమానాలు ఉన్నాయంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యాలు దేశ వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశానికి దారితీసింది. అటు రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత భిశ్వశర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలను కేసీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. ఆయనను సీఎం పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో బీజేపీ నేతలు కేసీఆర్ తీరును తప్పుబడుతున్నారు. టీఆర్ఎస్ బాస్పై వన్ బై వన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ..
తాజాగా బీజేపీ నాయకురాలు విజయశాంతి తెలంగాణ సీఎం కేసీఆర్పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కమలం బలపడుతుంటే టీఆర్ఎస్ బాస్ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. మరలా అధికారంలోకి రాలేమని తెలిసి కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు కేసీఆర్ తహతహలాడుతున్నారని ఆరోపించారు. ఎలాగైనా మరలా అధికారాన్ని నిలబెట్టుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల కంటే గొప్పగా రాహుల్ గాంధీపై ప్రేమను , సానుభూతిని సీఎం కేసీఆర్ చూపిస్తున్నారని విమర్శించారు. అంటే రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని అర్థమవుతోందని రాములమ్మ పేర్కొన్నారు.
అప్పుడు కేసీఆర్ కళ్లల్లో నీళ్లేందుకు రాలేదు..
గతంలో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు కామెంట్లు చేసినప్పుడు కేసీఆర్ కళ్లల్లో నీళ్లేందుకు రాలేదని విజయశాంతి ప్రశ్నించారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీపై లేని ప్రేమ ఇప్పుడే కేసీఆర్ కు ఎందుకు పుట్టిందన్నారు. అకస్మాత్తుగా నేడు రాహుల్ గాంధీపై ప్రేమ , సానుభూతి రావడం అధికార దాహమేనని ఆమె ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ను బొంద పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు.
గులాబీ బాస్కు ఓటమి భయం ..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భైంసాలో హిందువులపై దాడులు జరిగితే మాట్లాడని సీఎం కేసీఆర్.. ఇప్పుడు మత రాజకీయాల గురించి మాట్లడడం సిగ్గుచేటని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఐఎం నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ హిందువులను బెదిరింపులకు గురిచేసినప్పుడు కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ఆమె నిలదీశారు. ఓటమి భయం పట్టుకున్న కేసీఆర్.. బీజేపీని విమర్శస్తే తెలంగాణ ప్రజానీకం నమ్మబోరని దుయ్యబట్టారు. కేసీఆర్ కుటుంబ పాలనకు గుణపాఠం తప్పదని రాములమ్మ హెచ్చరించారు.