ఖమ్మం కోసం చంద్రబాబుపై అమిత్ షా ఒత్తిడి?
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలు కీలక మలుపులు తీసుకుంటున్నాయి. ఏపీలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. 17 లోక్ సభ నియోజకవర్గాలకు కనీసం 10 స్థానాలు గెలుచుకుంటుందంటూ సర్వేలు వెల్లడిస్తున్నాయి. బీజేపీ కూడా తెలంగాణలో పోటీచేసే అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, వరంగల్ స్థానాలు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయి.
భారత రాష్ట్ర సమితి తరఫున నామా నాగేశ్వరరావు ఖమ్మం ఎంపీగా బరిలోకి దిగుతున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. నామాకు గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నాయని, బీఆర్ఎస్ గెలుపు అవకాశాలు బలహీనపడ్డాయంటూ వార్తలు వస్తున్నాయి. పోటీకి నామా కూడా గతంలో చూపించినంత ఆసక్తి చూపించడంలేదు. ఖమ్మం నియోజకవర్గంలో భారతీయ జనతాపార్టీకి క్యాడర్ కూడా లేదు. ఆ జిల్లాల్లో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో ఆ పార్టీ ఏనాడూ విజయం సాధించలేదు.

కాంగ్రెస్ ను నిలువరించేందుకు పొత్తు ధర్మంలో భాగంగా తెలుగుదేశం పార్టీని ఖమ్మం బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తోంది. నామా నాగేశ్వరరావును టీడీపీలోకి తీసుకొని బరిలోకి దింపితే గెలుపు అవకాశాలున్నాయని సర్వేలు వెల్లడిచేస్తుండటంతో బీజేపీ టీడీపీపై ఒత్తిడి చేస్తోందంటున్నారు. ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ పోటీచేస్తే ఆ ప్రభావం గ్రేటర్ హైదరాబాద్ మొత్తం పడుతుందని, ఓటుబ్యాంకు పెరుగుతుందని బీజేపీ హైకమాండ్ లెక్కలు వస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు రెండో కుమారుడు జలగం వెంకట్రావు బీజేపీలో చేరారుకానీ ఆయనకు టికెట్ ఖరారు చేయలేదు. టీడీపీ బరిలోకి దిగితే ఖమ్మం రాజకీయాలే కాకుండా తెలంగాణ రాజకీయాలే మారిపోతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications