BJP: గుజరాత్ తర్వాత బీజేపీ టార్గెట్ తెలంగాణేనా..!
దేశంలో బీజేపీ ప్రభంజనం కొనసాగుతోంది. ఈ ఏడాదిలో జరిగిన ఉత్తర్ ప్రదేశ్, మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ కమలం పార్టీ విజయ దుందుభి మోగించింది. పంజాబ్ లో మాత్రం 2 సీట్లకే పరిమితమైంది. తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ జయకేతనం ఎగరేసింది. గుజరాత్ విజయం తర్వాత కాషాయ దళం దృష్టి తెలంగాణపై ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ కేంద్ర పెద్దలు
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ కేంద్ర పెద్దలు పావులు కదువుతున్నారు. తెలంగాణలో ముందస్తు వస్తుందన్న భావనతో కమలం పార్టీ నేతలు స్పీడ్ పెంచారు. గుజరాత్ ఉత్సాహంతో తెలంగాణలో పని చేయాలని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతో తెలంగాణలోని పలు ప్రాంతాలను చుట్టి వచ్చారు.

ఒక్క అసెంబ్లీ సీటు
అయితే 2018 ఎన్నికల్లో బీజేపీ ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే గెలుచుకుంది. కానీ ఆ తర్వాత ఆ పార్టీ క్రమంగా బలం పుంజుకుంటూ వస్తోంది. దుబ్బాలో రఘనందన్ రావు గెలుపు.. ఆ తర్వాత టీఆర్ఎస్ లో అత్యంత కీలక నేతగా, తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి ఈటల రాజేందర్ కాషాయ దళంలో చేరడంతో ఆ పార్టీకి మరింత ఊపు వచ్చింది. రాజేందర్ బీజేపీలో చేరడమే కాదు.. హుజురాబాద్ ఉపఎన్నికలో గెలిచి కమలానికి బలం పెంచారు.

మునుగోడు ఉపఎన్నిక
కొద్ది రోజుల క్రితం జరిగిన మునుగోడు ఉపఎన్నికలో కూడా బీజేపీ గట్టి పోటీని ఇచ్చింది. ఇక్కడ అధికార టీఆర్ఎస్ పార్టీ కేవలం 10 వేల ఓట్ల మెజారిటీతో గెలించింది. దీంతో రాష్ట్ర నాయకుల్లో మరింత ఉత్సాహం వచ్చింది. అయితే బీజేపీని అభ్యర్థుల కరువు వెంటాడుతుంది. పలు చోట్లు ఆ పార్టీకి సరైన అభ్యర్థులు లేరు. అందుకే బీజేపీ ఇతర పార్టీల నుంచి నేతలను ఆకర్షించే పనిలో పడింది.

చేరికలు
ఈటల రాజేందర్ నేతృత్వంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ లోని పలువురు నేతలతో సంప్రదింపులు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే బీజేపీకి తెలంగాణలో గెలవడం గుజరాత్ లో గెలిచినంత సులువు కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఏది ఏమైనా బీజేపీ కేంద్ర పెద్దలు మాత్రం తెలంగాణలో పాగా వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications