128వ రాజ్యాంగ సవరణ బిల్లు: తెలంగాణ బీజేపీలో జోష్..!!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన కొత్త పార్లమెంట్ భవన సముదాయం మనుగడలోకి వచ్చింది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది కేంద్రం. లోక్సభ, రాజ్యసభ సభ్యులు కొద్దిసేపటి కిందటే కొత్త పార్లమెంట్ భవనంలో లాంఛనంగా అడుగుపెట్టారు.
కొత్త పార్లమెంట్ భవనంలో ప్రవేశించిన వెంటనే జాతీయ గీతాలాపనతో సభా కార్యకలాపాలు మొదలయ్యాయి. స్పీకర్ ఓం బిర్లా తన స్థానంలో ఆసీనులయ్యారు. ఆ వెంటనే ప్రధాని మోదీ ప్రసంగించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు సహా పలు కీలకాంశాలను ఆయన ప్రస్తావించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రమంత్రి వర్గం ఆమోదించిందనీ పేర్కొన్నారు.

ఈ బిల్లుకు నారీ శక్తి వందన్ అధినియంగా పేరు పెట్టినట్లు మోదీ తెలిపారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర మంత్రివర్గంలో చాలాసేపు చర్చించామని పేర్కొన్నారు. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో మహిళా రిజర్వేషన్ బిల్లు చాలాసార్లు సభ ముందుకు వచ్చిందని, దాన్ని ఆమోదింపజేసుకోవడానికి తగినంత మెజారిటీ అప్పట్లో అధికార పక్షానికి లేదని గుర్తు చేశారు.
సంపూర్ణ మెజారిటీ లేకపోవడం వల్ల మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ను కల్పించాలనే ఓ కల సాకారం కాలేదని, కార్యరూపాన్ని దాల్చ లేకపోయిందని మోదీ చెప్పారు. ఇప్పుడు అదే బిల్లును ఆమోదింపజేసుకునే అవకాశం తనకు లభించిందని పేర్కొన్నారు. అలాంటి ఓ చక్కటి అవకాశాన్ని భగవంతుడు తనకు ఇచ్చాడని అన్నారు.

ఆయన ప్రసంగం ముగిసిన తరువాత కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్.. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. రాజ్యాంగాన్ని, అందులో పొందుపరిచిన అంశాలను మరింత బలోపేతం చేసేలా, సమతౌల్యాన్ని సాధించడానికి ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును సభలో ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు. 128వ రాజ్యాంగ సవరణ బిల్లు- 2023ని ప్రతిపాదించినట్లు తెలిపారు.
ఈ బిల్లును ప్రతిపాదించిన సందర్భం.. తెలంగాణ బీజేపీలో జోష్ను నింపింది. బిల్లు టేబుల్ అయిన వెంటనే తెలంగాణ బీజేపీ మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో రోడ్ల మీదికి వచ్చారు. సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచి పెట్టుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద బాణాసంచా కాల్చారు. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అవకాశాన్ని బీజేపీ సొమ్ము చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications