సిఎం కెసిఆర్ పేషీలో బోగస్ ఉద్యోగి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పేషిలో ఉద్యోగినంటూ మోసం చేయడానికి ప్రయత్నించిన వ్యక్తి బండారం బయటపడింది. వివరాలు ఇలా ఉన్నాయి - సికింద్రాబాదులోని మల్కాజిగిరికి చెందిన అంజయ్య కొడుకు గత సెప్టెంబర్లో కరీంనగర్లో ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు దశదిన కర్మకు సంబంధించి అంజయ్య పత్రికలలో ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటనలో ఉన్న ఫోన్ నెంబర్ చూసిన ఓ వ్యక్తి తాను సీఎం ఫేషిలో అడిషనల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నానని చెప్పుకుని మీ కొడుకు చనిపోవడంతో ప్రభుత్వం నుంచి మీకు పరిహారం మంజూరయ్యిందనీ అందుకు సంబంధించిన బిల్లులన్నీ తయారు చేసుకోండనీ అంజయ్యకు ఫోన్ చేశాడు. అందుకు రూ. 10 వేలు ఖర్చవుతాయని దానిని బ్యాంకు డిపాజిట్ చేయాలని సూచించాడు.
అయితే, మొదటి సారి అంజయ్య పట్టించుకోలేదు. రెండు మూడుసార్లు ఫోన్ చేయడంతో నిజమేనని నమ్మిన అంజయ్య రూ. 10 వేలు అతడు సూచించిన ఖాతాలో జమ చేశాడు. ఆ తరువాత సురేష్కుమార్ నుంచి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అప్పు ఇప్పిస్తానంటూ ఓ వ్యక్తి తన వద్ద రూ.10వేలు తీసుకుని అదృశ్యమయ్యాడని దేవదాస్ అనే మరో బాధితుడు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ రెండు కేసులను పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితిడొక్కడేనని తేల్చారు. దర్యాప్తులో అతను కరీంనగర్కు చెందిన సురేష్కుమార్ అని తేలింది. వృత్తిరీత్యా ప్రైవేట్ టీచరు. తనకు సీఎం పేషీలో పరిచయాలున్నాయని, లేదా తానే సీఎం అడిషనల్ సెక్రటరీకి పీఏనని చెప్పుకుంటాడు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల నుంచి లోన్లు ఇప్పిస్తానని నమ్మబలుకుతాడు. ఏసీబీకి చిక్కిన ఉద్యోగల వద్దకు వెళ్లి ఆ కేసు మూయించేస్తానని చెప్తాడు. ఇలా చాలా మందిని, చాలా రకాలుగా మోసం చేశాడని సీసీఎస్ అదనపు కమిషనర్ విజేందర్ రెడ్డి చెప్పారు. ఇతనికి వరంగల్కు చెందిన మాధవరావు, రమేష్లు కూడా సహకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడు సురేష్కుమార్ను అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరు పరిచారు. కేసును ఇన్స్పెక్టర్ మధుసూదన్రావు బృందం దర్యాప్తు చేస్తోంది.