పెళ్లికి ఆగలేక యువకుడి ఆత్మహత్య: కాలేజీకని వెళ్లి అమ్మాయి అదృశ్యం
మహబూబ్నగర్/ హైదరాబాద్: పెళ్లి ముహూర్తాలు లేవని, మరో ఏడాది ఆగాల్సి వస్తుందని పెద్దలు చెప్పడంతో మనస్తాపానికి గురై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘనట మహబూబ్నగర్ జిల్లా ధన్వాడ మడలం రాంకిష్టాయిపల్లి గ్రామంలో శుక్రవారంనాడు చోటు చేసుకుంది.
రాంకిష్టాయిపల్లికి గ్రామానికి చెందిన ఒగ్గు మహేష్ (22) గొర్రెల కాపరిగా పనిచేస్తున్నాడు. కొన్ని నెలలుగా కరీంనగర్ జిల్లాలో మేకలనూ గొర్రెలనూ మేపుకుంటున్నాడు. కుటుంబ సభ్యుల సూచన మేరకు పెళ్లి సంబంధాలు చూసేందుకు ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు.
అయితే, మహేష్ పేరుతో ఒక ఏడాది వరకు శుభ ముహూర్తాలు లేవని పెద్దలు చెప్పారు. దాంతో పెళ్లి చేసుకోవాలని ఆతురత పడిన మహేష్ ఆ విషయం తెలిసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారంనాడు గ్రామ శివారులోని పొలంలో ఉన్న పశువుల పాకలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇదిలావుంటే, కళాశాలకు వెళ్తున్నాని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన విద్యార్థిని అదృశ్యమైంది. హైదరాబాదులోని ఎన్టీఆర్ నగర్కు చెందిన గుంజి కల్పన (21) కొత్తపేటలోని శివాని కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. అయితే, గురువారం ఉదయం కాలేజీకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు.
దాంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కలవారిని, తెలిసినవారిని అడిగారు. పలు చోట్ల గాలించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో తల్లి ఈశ్వరమ్మ ఎల్బీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.