ఆ డబ్బేవరిది :చిరువ్యాపారి ఖాతాలో 17 కోట్లు,డిపాజిట్ కాగానే పలు ఖాతాలకు బదిలీ
హైదరాబాద్ :ఓ సాధారణ వ్యాపారి బ్యాంకు ఖాతాలో కోట్లాది రూపాయాల లావాదేవీలు చోటుచేసుకొన్నాయి. ఈ విషయాన్ని ఆదాయపు పన్నుశాఖాధికారులు గుర్తించారు. అయితే ఈ నగదు ఎక్కడి నుండి వచ్చిందనే సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. పెద్ద నగదు నోట్ల రద్దు కంటే ముందు నుండే ఈ ఖాతా నుండి కోట్ల రూపాయాల లావాదేవీలు సాగుతున్నాయి.
హైద్రాబాద్ లో ఇటీవలనే ఓ క్యాబ్ డ్రైవర్ ఖాతాలో కోట్లాది రూపాయాల నగదును కనుగొన్నారు.అయితే ఈ నగదుపై జరిమానాను కట్టేందుకు కూడ క్యాబ్ డ్రైవర్ అధికారులకు తేల్చిచెప్పాడు.
అయితే రోడ్డు పక్కన వ్యాపారం చేసుకొనే చిన్న వ్యాపారి బ్యాంకు ఖాతాలో కోట్లాది రూపాయాల లావాదేవీలు జరిగినట్టుగా ఆదాయపు పన్నుశాఖాధికారులు గుర్తించారు.అయితే పెద్ద నగదు నోట్ల రద్దు కంటే ఓ మాసానికి ముందే బ్యాంకు ఖాతాను ప్రారంభించాడు.
హైద్రాబాద్ నగరంలోని ఓ జాతీయ బ్యాంకులో ఈ చిరు వ్యాపారి గత ఏడాది సెప్టెంబర్ మాసంలో ఖాతాను ప్రారంభించాడు. ఆ సమయంలో మూడు కోట్ల రూపాయాలను డిపాజిట్ చేశాడు. అయితే ఈ బ్యాంకులో డిపాజిట్ చేసిన మూడు కోట్ల రూపాయాలను విడతల వారీగా అదే మాసంలో డ్రా చేశాడు.
అయితే పెద్ద నగదు నోట్ల రద్దు తర్వాత ఇదే బ్యాంకు ఖాతాలో సుమారు 14 కోట్లను డిపాజిట్ చేశాడు. రద్దు చేసిన నగదునే డిపాజిట్ చేశాడు.అయితే అదే మాసంలో వేర్వేరు ఖాతాలను నగదును బదిలీ చేశాడు.
ఈ ఖాతాపై అనుమానం వచ్చిన ఆదాయపు పన్నుశాఖాధికారులు ఆయనను ప్రశ్నించారు. అయితే ఖచ్చితమైన సమాచారాన్ని తెలుసుకోవడంలో అధికారులు విఫలమయ్యారు.అయితే ఈ ఖాతానుండి ఎవరెవరికీ నగదు బదిలీ అయిందనే విషయమై ఆదాయపు పన్నుశాఖాధికారులు ఆరా తీస్తున్నారు.