లంచానికి బెయిల్?: మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్పై కేసు, ఏసీబీ సోదాలు
హైదరాబాద్: మరో అవినీతి న్యాయమూర్తిపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) కేసు నమోదు చేసింది. బెయిల్ మంజూరులో భారీ మొత్తంలో లంచం తీసుకున్నట్లు వస్తున్న ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. డ్రగ్స్ సరఫరా కేసులో బెయిల్ మంజూరు చేసేందుకు హైదరాబాద్ ఒకటో అదనపు మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ రాధాకృష్ణమూర్తి రూ.7.50లక్షలు లంచం తీసుకున్నట్లు హైకోర్టు దృష్టికి వెళ్లింది.
ఈ విషయంపై పరిశీలించిన హైకోర్టు... లంచం తీసుకున్నట్లు ప్రాధమిక ఆధారాలు లభ్యం కావడంతో కేసు నమోదు చేయాలని తమను ఆదేశించినట్లు ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు తెలిపారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేయడంతో పాటు సికింద్రాబాద్లో మెజిస్ట్రేట్ రాధాకృష్ణమూర్తి ఇంటిలో సోదాలు నిర్వహిస్తున్నట్లు పూర్ణచంద్రరావు తెలిపారు.
మాదకద్రవ్యాల(డ్రగ్స్) కేసులో గాంధీనగర్లో పట్టుబడిన నైజీరియన్లకు బెయిల్ మంజూరు చేసేందుకు మెజిస్ట్రేట్ రూ.10లక్షలకు పైగా లంచం డిమాండ్ చేశారని, అయితే చివరకు రూ.7.50లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని బెయిల్ మంజూరు చేశారని డీజీ పూర్ణచంద్రరావు తెలిపారు.
కాగా, ఇలాంటి కేసులోనే వారం రోజుల కిందట హైకోర్టు ఆదేశాలతో మరో మేజిస్ట్రేట్పై కూడా కేసు నమోదు చేసిన ఏసీబీ ఆయన ఇంటిలోనూ సోదాలు నిర్వహించింది. ఇటీవల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జగిత్యాల ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.