పెళ్ళి ఆలస్యమైందంటూ పురోహితుడిపై వధువు బంధువు దాడి, ఆసుపత్రిలో పురోహితుడు
ఆలస్యంగా పెళ్ళికి కారణమయ్యారనే కోపంతో మద్యం మత్తులో వధువు బంధువు పురోహితుడిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకొంది.
కరీంనగర్: పెళ్ళి ఆలస్యానికి కారణమయ్యారంటూ పురోహితుడిపై వధువు బంధువులు దాడికి దిగారు. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పురోహితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా బసంత్ నగర్ లో చోటుచేసుకొంది.
కరీంనగర్ జిల్లా బసంత్ నగర్ కు చెందిన రాజయ్య కూతురు వివాహం జరిపించేందుకుగాను పాలకుర్తికి చెందిన స్థానిక కోదండ రామాలయ పూజారి సేనాపతి వెంకటరమణాచారి వెళ్ళారు.
అయితే ముహుర్త సమయాని కటే వివాహం ఆలస్యమైంది.అయితే వివాహం ఆలస్యమైందనే విషయాన్ని మద్యం సేవించి వచ్చిన వధువు తరపు బంధువు పురోహితుడితో గొడవకు దిగాడు.
దీంతో పురోహితుడితో ఆయన వాగ్వావాదానికి దిగాడు. కొద్దిసేపు వివాహ తంతు ఆపాల్సి వచ్చింది.ఇరువైపులా బంధువులు సర్ధిచెప్పి వివాహ తంతును కొనసాగించారు.
వివాహం పూర్తైన తర్వాత చొప్పదండి మండలకేంద్రానికి చెందిన వధువు తరపు బంధువు పురోహితుడిపై కర్రతో దాడి చేసి పిడిగుద్దులు గుద్దాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ఆయనను పెద్దపల్లి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలించాలని వైద్యులు సూచించారు. విషయం తెలిసిన బసంత్ నగర్ పోలీసులు సంఘటనపై విచారణ నిర్వహిస్తున్నారు.