ఏపీ సహా 6 రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కార్యకలాపాలు: ఢిల్లీ వేదికగా కేసీఆర్ దూకుడు షురూ
హైదరాబాద్: ఇటీవల దేశ రాజధానిలో భారత్ రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్.. పార్టీ విస్తరణపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. డిసెంబర్ నెలాఖరు నుంచి బీఆర్ఎస్ కార్యకలాపాలు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఊపందుకుంటాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
ఆరు రాష్ట్రాల్లో బీఆర్ఎస్ శాఖలు
త్వరలోనే ఢిల్లీలో పార్టీ అధినేత మకాం వేసి అక్కడే జాతీయ పార్టీల నేతలు, రైతు సంఘాల నేతలతో వరుస భేటీలు జరిపే అవకాశం ఉంది. అబ్ కీ బార్ కిసాన్ సర్కారు అన్న నినాదంతో ముందుకు పోవాలని పార్టీ ఆవిర్భావం రోజు హైదరాబాద్లో కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా ముందుగా ఆరు రాష్ట్రాల్లో పార్టీ అనుబంధంగా భారత రాష్ట్ర కిసాన్ సమితి విభాగాలను ప్రారంభించాలని నిర్ణయించారు.
ఏపీ సహా ఈ ఆరు రాష్ట్రాలపై బీఆర్ఎస్ ఫోకస్
క్రిస్మస్ పండగ తర్వాత ఆయా రాష్ట్రాల్లోని భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు, నేపథ్యాలను అనుసరించి అక్కడి ప్రజల ఆకాంక్షల మేరకు ఎలాంటి విధానాలు అవలంభించాలన్న విషయమై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఆ దిశగా నేతలను సమాయాత్తం చేస్తున్నారు. డిసెంబర్ నెలాఖరుకల్లా ఆంధ్రప్రదేశ్ తోపాటు పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తెలంగాణలో బీఆర్ఎస్ కిసాన్ సెల్లను ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
బీఆర్ఎస్లో చేరేందుకు ఇతర రాష్ట్రాల నేతల సుముఖత
వచ్చే ఏడాది మొదటి నెల నుంచే మరింత వేగంగా బీఆర్ఎస్ కార్యకలాపాలు విస్తారిస్తాయని చెబుతున్నాయి. జాతీయ స్థాయిలో బీఆర్ఎస్ తన వాణి వినిపిస్తూ.. దేశ ప్రజలను ఆకర్షిస్తూ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి.. ఇతర రాష్ట్రాలతోపాటు పొరుగు రాష్ట్రమైన ఏపీ ప్రజలు, రాజకీయ నాయకులను ఆకర్షిస్తోందని తెలిపారు. ఇప్పటికే బీఆర్ఎస్ లో తాము భాగస్వాములమవుతామని ఏపీతోపాటు పలు రాష్ట్రాల నేతలు ముందుకు వస్తున్నారని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి.
ఢిల్లీ వేదికగా కేసీఆర్ దూకుడు: ఏపీలో ఆరు జిల్లాల్లో బీఆర్ఎస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీఆర్ఎస్ను ప్రారంభించడానికి రంగం సిద్దం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఉత్తరాంధ్ర సహా పలు జిల్లాల నుంచి ఇప్పటికే 70-80 మంది ప్రముఖులు కేసీఆర్ ను సంప్రదించినట్లు వెల్లడించాయి. ఏపీతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి కూడా పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు సుముఖత చూపుతున్నారని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే కన్నడ, మరాఠ, ఒరియా తదితర భాషలకు చెందిన రచయితలు, సాహితీవేత్తలు, పాటల రచయితలతో పార్టీ అధినేత కేసీఆర్ చర్చలు జరుపుతున్నారని తెలిపాయి. డిసెంబర్ నెలాఖరులో ఢిల్లీ వేదికగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలుప్రకటిస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తానికి వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు బీఆర్ఎస్ను అన్ని విధాలా సిద్ధం చేసేందుకు కసరత్తులు వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.