జూబ్లీహిల్స్ బై పోల్ బీఆర్ఎస్ అభ్యర్ధి ఖరారు, అక్కడే అసలు ట్విస్ట్..!!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణలో కీలకంగా మారుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల కాలంలో జరుగుతున్న ఎన్నిక కావటంతో ఈ ఎన్నిక ను అధికార పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. సిట్టింగ్ సీటు నిలబెట్టుకోవటం బీఆర్ఎస్ కు సవాల్ గా మారుతోంది. అటు బీజేపీ సైతం ఈ సీటు లో గెలుపు కోసం వ్యూహాలు అమలు చేస్తోంది. కాగా, బీఆర్ఎస్ నుంచి పోటీలో నిలిచే అభ్యర్ధిని పార్టీ ఖరారు చేసింది. ఇతర పార్టీల కంటే ముందుగానే ప్రచారం ప్రారంభించింది. మారుతున్న లెక్కలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హోరా హోరీగా మారుతోంది.
జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ నుంచి మాగంటి సునీత పోటీ చేయనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను గెలిపించుకునే బాధ్యతను ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త తీసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు దివంగత మాగంటి గోపీనాథ్ సేవల్ని కొనసాగించడానికి సునీత ముందుకొచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఓటర్లు కూడా సునీతను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్ రేవంత్ రెడ్డి సర్కార్ అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ సవరణలను దేశంలోనే తొలిసారిగా రేవంత్ ప్రభుత్వం అమలుచేసిందన్నారు. చరిత్రలో తొలిసారి ముస్లిం మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని కేటీఆర్ విమర్శించారు.

హైదరాబాద్లో మాత్రం బీఆర్ఎస్ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని కేటీఆర్ గుర్తు చేసారు. ప్రత్యర్థులు ఎంత దుష్ప్రచారం చేసినా జూబ్లీహిల్స్లో మూడోసారి మాగంటి గోపీనాథ్ను గెలిపించారన్నారు. మాగంటి గోపీనాథ్ సేవల్ని కొనసాగిస్తామని ఆయన సతీమణి సునీత మీ ముందుకు వచ్చిందని.. అందరూ ఆమెను ఆశీర్వదించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అటు కాంగ్రెస్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తరువాత అభ్యర్దిని ఖరారు చేయాలని భావిస్తోంది. ఈ సీటు నుంచి పోటీ చేయాలని భావించిన అజహారుద్దీన్ ను ఎమ్మెల్సీగా చేయటంతో బీసీ అభ్యర్దిని బరి లోకి దించాలనేది రేవంత్ ఆలోచనగా తెలుస్తోంది. అయితే, కాంగ్రెస్ నుంచి పోటీ ఎక్కువగా ఉంది. ఇక..బీజేపీ ఇక్కడ సామాజిక.. గత ఎన్నికల అనుభవాల కారణంగా అభ్యర్ది విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తోంది. ఎంఐఎం నిర్ణయం కాంగ్రెస్ పైన ప్రభావం చూపనుంది. బీఆర్ఎస్ ఇతర పార్టీల కంటే ముందుగానే అభ్యర్ది ఖరారు.. ప్రచారం తో ఇక్కడ వేగంగా సమీకరణాల్లో మార్పు కనిపిస్తోంది. దీంతో, ఈ ఉప ఎన్నిక పోరు మరింత ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications