చంద్రబాబు డైరెక్షన్లో రేవంత్- అమరావతికి డైవర్ట్: హైడ్రా ఉద్దేశం అదే
Padi Kaushik Reddy: ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితికి చెందిన శాసన సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి మరోసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ఛలో అరికెపూడి గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలపై ఆయన మాట్లాడారు.
బీఆర్ఎప్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఇంట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కౌశిక్ రెడ్డి మాట్లాడారు. అరికెపూడి గాంధీ చెప్పినట్లు ఇది ఇద్దరికి మధ్య జరుగుతున్న వ్యక్తిగత గొడవగా స్పష్టం చేశారు. ఆంధ్రోడు అంటూ తాను వ్యక్తిగతంగా అరికెపూడి గాంధీని ఉద్దేశించి మాట్లాడానే తప్ప ఏపీకి చెందిన సెటిలర్ల గురించి కాదని వివరణ ఇచ్చారు.

హైదరాబాద్ సహా తెలంగాణలో నివసిస్తోన్న ఆంధ్ర సెటిలర్లపై తనకు పూర్తి గౌరవం ఉందని పేర్కొన్నారు. ఆంధ్రుల కాలికి ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానంటూ గతంలో కేసీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఆంధ్రులకు వ్యతిరేకంగా ఒక్క సంఘటన కూడా జరగలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లర రాజకీయాల కోసం ఆంధ్రా- తెలంగాణ పేరుతో రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
ఇప్పటికే హైడ్రా పేరుతో ప్రభుత్వం రోజుకో బిల్డింగ్ను కూలగొడుతోందని, హైదరాబాద్లో నివసించే సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందని కౌశిక్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలంటే చాలామంది భయపడుతున్నారని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను డ్యామేజ్ చేస్తోన్నారని ఆరోపించారు.
హైడ్రా పేరుతో కుట్రలకు ప్రభుత్వం పాల్పడుతోందని, హైదరాబాద్ అభివృద్ధిని ఉద్దేశపూరకంగానే అడ్డుకుంటోందని పాడి కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. తమ పదేళ్ల ప్రభుత్వ హయాంలో ఆంధ్రా వాళ్లు మొదలుకుని ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రజలందరినీ స్వాగతించామని, హైదరాబాద్ను దేశంలోనే నంబర్ వన్ సిటీగా మార్చామని అన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ట్రాప్లో తెలంగాణ ప్రభుత్వం పడిందని కౌశిక్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్లో ఇక్కడి పెట్టుబడులన్నింటినీ కూడా అమరావతికి తరలించే ప్రయత్నానికి ప్రభుత్వం పూనుకుందని ఆరోపించారు. ఇలాంటి చర్యలను యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు.












Click it and Unblock the Notifications