కాంగ్రెస్ లో చేరిక పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే బిగ్ ట్విస్ట్..!!
తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తమ వైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తోంది. ఖమ్మం జిల్లాకు చెందిన వెంకటరావు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తాజా సీఎం రేవంత్ తో సమావేశమయ్యారు. ఆయన కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం సాగింది. అయితే, చివరి నిమిషంలో ప్రకాశ్ గౌడ్ తాను కాంగ్రెస్ లో చేరటం లేదని ప్రకటించారు.
ప్రకాశ్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. రేవంత్ సీఎం అయిన తరువాత పలు సందర్భాల్లో కలిసారు. తాజాగా ఆయన రేవంత్ తో భేటీతో ఇక కాంగ్రెస్ కండువా కప్పుకోవటం ఖాయమనే ప్రచారం సాగింది. ఈ సమయంలో ఆయన తన అనుచరులు, కేడర్ తో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరటం పైన పార్టీ కార్యకర్తలు, మద్దతు దారుల నుంచి ప్రకాశ్ గౌడ్ అభిప్రాయ సేకరణ చేసారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని మెజార్టీ అభిప్రాయం వ్యక్తం అయినట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల పైన చర్చించారు.

కార్యకర్తల నుంచి ప్రతిపాదన విరమించుకోవాలనే సూచన వచ్చింది. దీంతో, ప్రస్తుతానికి ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ లో చేరాలనే ఆలోచనకు బ్రేక్ ఇచ్చారు. తాజాగా శుక్రవారం సీఎం రేవంత్ తో ప్రకాశ్ గౌడ్ భేటీ తరువాత ఇక కాంగ్రెస్ లో చేరటం లాంఛన ప్రాయమేననే వాదన వినిపించింది. కానీ, మద్దతు దారుల నుంచి అనుకూలత రాకపోవటంతో ప్రకాశ్ గౌడ్ తన నిర్ణయం మార్చకున్నారు. రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గం చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ప్రకాశ్ గౌడ్ చేరిక ద్వారా పార్టీకి కలిసి వస్తుందని కాంగ్రెస్ నేతలు అంచనా వేసారు. తాజాగా, ప్రకాశ్ గౌడ్ నిర్ణయంతో కాంగ్రెస్ కు షాక్ గా మారింది. ఈ మొత్తం వ్యవహారం పైన ప్రకాశ్ గౌడ్ అధికారికంగా తన నిర్ణయం ప్రకటించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications