బీజేపీలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ విలీనం..!?
బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్ ఏంటి. ఇటు రాష్ట్రంలో..అటు ఢిల్లీలో బీఆర్ఎస్ మనుగడ పైన చర్చ సాగుతోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. అటు ఢిల్లీలో గులాబీ పార్టీ ఎంపీలు బీజేపీతో టచ్ లోకి వెళ్తున్నట్లు ప్రచారం సాగుతోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను వారించేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. ఈ సమయంలోనే బీజేపీలో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు చేరిక ఖాయమనే వాదన వినిపిస్తోంది.
బీఆర్ఎస్ కు షాక్
బీఆర్ఎస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తగులుతున్న షాక్లతో కారు పార్టీ కోలుకోలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరు క్యూలో ఉన్నారు. ఇక ఒకేసారి ఆరుగురు ఎమ్మెల్సీలు కారు దిగిపోవడం బీఆర్ఎస్కు ఊహించని పరిణామం. ఇవన్నీ ఒకఎత్తయితే.. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు ఒకట్రెండు రోజుల్లో గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతారని సమాచారం.

ఢిల్లీలో బీజేపీ ఆపరేషన్
ఎమ్మెల్యేలు పార్టీ వీడకుండా వారించేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించటం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకునే పనిలో ఉంటే అటు కేంద్రంలోని బీజేపీ కూడా షురూ చేసింది. లోక్సభ ఎంపీలు లేకపోవడంతో ఉన్న రాజ్యసభ సభ్యులను చేర్చుకునే పనిలో నిమగ్నమైందని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే బీజేపీలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ విలీనం చేయడానికి రంగం సిద్ధమైందని బీజేపీ నేతలు చెబుతున్నారు. కమలం గూటికి నలుగురు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు చేరుతున్నట్లు ఢిల్లీ వర్గాల సమాచారం.
కమలం గూటికి ఎంపీలు
బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం రాజ్య సభలో పార్థసారథి రెడ్డి, దామోదర్రావు, సురేశ్ రెడ్డి, వద్ధిరాజు రవిచంద్రలు ఎంపీలుగా ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నుంచి కేవలం ఇద్దరు రేణుఖ చౌదరి, అనిల్ కుమార్ యాదవ్లు మాత్రమే రాజ్యసభ ఎంపీలుగా ఉన్నారు. వీరు బీజేపీలో చేరటానికి సిద్దపడితే త్వరలోనే బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీన ప్రక్రియ ఉంటుందని భావిస్తున్నారు. ఎంపీలతోనూ కాంగ్రెస్ టచ్ లోకి వచ్చిందనే వాదన వినిపిస్తోంది.దీంతో..బీఆర్ఎస్ ఎంపీల తుది నిర్ణయం ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications