బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్: కావాలనే బీజేపీని సైడ్ చేస్తున్నారా?
కర్ణాటక ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతూ వచ్చాయి. రాష్ట్రంలో ప్రస్తుతం బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అంతకు ముందు తెలంగాణాలో ప్రధానంగా బిజెపిని మాత్రమే టార్గెట్ చేసిన బీఆర్ఎస్ ప్రస్తుతం బిజెపిని పూర్తిగా పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది.
కేవలం కాంగ్రెస్ పార్టీని, గత కాంగ్రెస్ పాలనను టార్గెట్ చేస్తూ ఇటీవల కాలంలో మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇది కావాలని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ప్రాధాన్యత తగ్గించటానికి జరుగుతున్న బీఆర్ఎస్ స్ట్రాటజీగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బిజెపి చెప్పే ప్రయత్నం చేసింది. అందులో భాగంగానే దూకుడుగా బిఆర్ఎస్ పార్టీపై బిజెపి నాయకులు విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో, జిహెచ్ఎంసి ఎన్నికల్లో కూడా పలు స్థానాలలో బిజెపి విజయం సాధించడంతో తెలంగాణ ప్రజలకు కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బిజెపి కనిపించింది.
కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయి మనుగడ కోసం పోరాటం చేయవలసి వచ్చింది. అయితే ఇప్పుడు తమకు గట్టి పోటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ నే అన్న చందంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు, కేటీఆర్ వంటి మంత్రులు కాంగ్రెస్ ను పదేపదే టార్గెట్ చేస్తున్నారు. దీంతో బీజేపీకి తెలంగాణలో ప్రాధాన్యత లేదు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇది కావాలని బీజేపీని నిర్వీర్యం చేసే కుట్రగా పలువురు బీజేపీ నాయకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగానూ సత్తా చాటలేని కాంగ్రెస్ తమ ప్రత్యర్థి అని చెప్పడం, కేవలం తెలంగాణలో బీజేపీ లేదని చెప్పడం కోసమే అని భావిస్తున్నారు. అయితే బీజేపీ నేతలు బీఆర్ఎస్ నేతలు, మంత్రులు తమను టార్గెట్ చేయకపోవడంతో ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తూ, కెసిఆర్ ఎత్తుగడలను అర్థం చేసుకుంటున్నారు. అదును చూసి దెబ్బ కొట్టాలని భావిస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని సైడ్ కు నెట్టి, కాంగ్రెస్ ను టార్గెట్ చేయడంతో రాజకీయాలలో ఒక్కసారిగా విచిత్రమైన పరిస్థితి నెలకొంది.












Click it and Unblock the Notifications