ఈ నెల 9నుండే బడ్జెట్ సమావేశాలు..! రెండోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తెలంగాణ సీఎం..!!
హైదరాబాద్: తెలంగాణలో గులాబీ పార్టీ రెండవసారి అదికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతోంది. సభలో పద్దులను సీఎం చంద్రశేఖర్ రావే ప్రవేశ పెడతారా లేక ఆశాఖకు మంత్రిని నియమిస్తారా అనే సందేహాలు గులాబీ నేతల్లో కలుగుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు సీఎం చంద్రశేఖర్ రావు ఓటాన్ ఎకౌంట్ ను ప్రవేశపెట్టిన అంశం తెలిసిందే. ఇక 2019-20 ఆర్ధిక సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. అందుకోసం ఈ నెలలో ముహూర్తాన్ని ఖరారు చేసింది తెలంగాణ సర్కార్.
బడ్జెట్ సమావేశాలకు కుదిరిన ముహూర్తం..! ఈ నెల 9నుంచి సమావేశాలు..!!
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. గవర్నర్ నరసింహన్ ఆదేశాల మేరకు శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు నోటిఫికేషన్ జారీ చేశారు. 9వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలు సమావేశం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల పూర్తి ఎజెండా, పనిదినాలు బీఏసీ భేటీలో ఖరారు చేస్తారు. 9న బడ్జెట్ ప్రవేశపెట్టడంతో సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, శాసన మండలిలో సీఎం తరఫున ఎవరైన మంత్రి బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న సీఎం..! కేసీఆర్ పర్యవేక్షణలో ఆర్థిక శాఖ.!!
గత బడ్జెట్ సమావేశాల్లో ఆరు నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వార్షిక పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. సెప్టెంబర్ 4, 9, 14 తేదీల్లో సమావేశాలు ప్రారంభించుకునేందుకు తొలుత ప్రతిపాదన వచ్చింది. చివరికి అన్ని అంశాలూ పరిశీలించిన అనంతరం 9వ తేదీని ప్రభుత్వం ఖరారు చేసింది. ఆర్థిక వ్యవహారాలు కూడా ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావే చూస్తున్న నేపథ్యంలో శాసనసభలో ఆయనే బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
ఆర్థిక శాఖకు మంత్రిని నియమిస్తారా..? మంత్రివర్గ విస్తరణపై నెలకొన్న ఆసక్తి..!!
తెలంగాణ ప్రభుత్వం ప్రజా పరిపాలనలో దూసుకెళ్తున్నా కొన్ని అంశాల్లో సంధిగ్దత నెలకొంది. కొన్ని కీలక శాఖలు ముఖ్యమంత్రి తనదగ్గరే అట్టిపెట్టుకోవడం, ఇంతవరకు క్యాబినెట్ విస్తరించకపోవడం వంటి అంశాలు ప్రభుత్వం వర్గాలను కలవరానికి గురిచేస్తున్నాయి. పూర్తి స్థాయి బడ్జెట్ కోసం కసరత్తు జరుగుతున్న సందర్బంలో అసలు శాసన సభలో ఎవరు బడ్జెట్ ప్రవేశ పెడతారు అనే అంశం పై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆర్ధిక శాఖను ఇప్పటి వరకూ సీఎం చంద్రశేఖర్ రావు తన వద్దనే ఉంచుకోవడంతో ఈ ప్రశ్న ఉత్పన్నమవుతున్నట్టు తెలుస్తోంది. ఇంతకి చంద్రశేఖర్ రావు బడ్జెట్ సమావేశాలలోపు మంత్రి వర్గాన్ని విస్తరించి ఆర్ధిక మంత్రిని నియమిస్తారా..? లేక ముఖ్యమంత్రే స్వయంగా బడ్జెట్ ప్రవేశ పెడతారా అనే అంశం ఆసక్తి రేపుతోంది.
ఓటాన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సీఎం..! ఇప్పుడు పూర్తి స్తాయి బడ్జెట్..!!
పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ను ఈనెల 9న శాసన సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో.. ఇప్పుడు అందరి దృష్టి ఆర్థికశాఖ మంత్రిపై పడింది. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ ఆ శాఖకు మంత్రిని నియమించని సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రశేకర్ రావు ఆ శాఖను తన వద్దే ఉంచుకున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఆయనే స్వయంగా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రతిపాదించారు. ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పనకు కసరత్తులు ఊపందుకున్న తరుణంలో మళ్లీ ముఖ్యమంత్రే పద్దును ప్రవేశపెడతారా..? లేక క్యాబినెట్ బెర్తులన్నింటినీ నింపటం ద్వారా కొత్త ఆర్థిక మంత్రి చేత బడ్జెట్ను ప్రవేశపెట్టిస్తారా...? అనేది ఇప్పుడు చర్చగా మారింది.