ఎల్లారెడ్డి ఎమ్మెల్యే భార్యను దూషించాడు, కేసు
ఆయన భార్య మంజుల స్థానిక సంక్షేమ సంఘం అధ్యక్షురాలిగా ఉంటున్నారు. ఆదివారం నిర్వహించిన సంక్షేమ సంఘం సమావేశంలో స్థానికంగా నివాసం ఉంటున్న బాలరాజు దూషించాడు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు అతని పైన కేసు నమోదు చేశారు.
రైలు కింద పడి తల్లీకూతుళ్ల ఆత్మహత్య
సూపర్మార్కెట్కు వెళ్లి వస్తానని కుమార్తెతో కలిసి ఇంటి నుంచి వెళ్లిన ఓ మహిళ కొద్దిసేపటికి ఘట్కేసర్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. గాంధీనగర్లోని మ్యారీగోల్డ్ అపార్ట్మెంట్లో నివాసముంటున్న శ్యాంప్రసాద్కు వరంగల్ జిల్లా బచ్చన్నపేటకు చెందిన స్వప్నతో మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి ఇషాన్వీ అనే కుమార్తె, అచ్యుత్ అనే కుమారుడు ఉన్నారు.
ఓ సంస్థలో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్న శ్యాంప్రసాద్ భార్యాపిల్లలు, తల్లితో కలిసి నివాసముంటున్నాడు. సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో స్వప్న కుమారుడు అచ్యుత్ను అత్తగారి వద్ద ఉంచి ఇషాన్వీతో కలిసి గాంధీనగర్లోని మోర్ సూపర్మార్కెట్ వెళ్లి వస్తానని చెప్పి బయటకు వెళ్లింది. మధ్యాహ్నం అయినా వారు ఇంటికి రాకపోవడంతో శ్యాంప్రసాద్ తల్లి విషయాన్ని కుమారుడికి చెప్పింది. ఇంటికి వచ్చిన శ్యాంప్రసాద్ మోర్ సూపర్మార్కెట్కు వెళ్లగా అక్కడ కనిపించలేదు.
భార్య, కుమార్తెల ఆచూకీ కోసం అనేక చోట్ల వెతికినా ప్రయోజనం లేకపోవడంతో ముషీరాబాద్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తొలుత స్వప్న స్వగ్రామం వెళ్లి ఉంటుందని భావించారు. సూపర్ మార్కెట్లో సీసీ పుటేజీలను పరిశీలించాలని అనుకున్నారు.
ఈ లోగా ఘట్కేసర్లోని యానాంపల్లి వద్ద రైలు పట్టాలపై మహిళ, బాలిక మృతదేహాలు ఉన్నట్టు సమాచారం అందింది. అక్కడకు వెళ్లిన పోలీసులు మృతదేహాలు స్వప్న, ఇషాన్వీవిగా గుర్తించారు. వారు ఆత్మహత్య చేసుకున్నట్టు నిర్ధారించారు. వీరి ఆత్మహత్యకు కారణాల గురించి అన్వేషిస్తున్నారు. తనకు భార్యతో విభేదాలు లేవని, వారు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని శ్యాంప్రసాద్ చెబుతున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
క్వారీ గుంతలో పడిన దంపతులు
ఓ క్వారీ గుంతల్లో బట్టలు ఉతకడానికి వెళ్ళిన భార్యాభర్తలు ప్రమాదవశాత్తు అందులో పడిపోయారు. భార్య మరణించగా, భర్త ఆచూకీ లభించలేదు. అల్వాల్లోని హెచ్ఎంటీ కాలనీలో నివసిస్తున్న నరసింహ (50), వనిత (45) దంపతులు భిక్షాటన చేస్తుంటారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో వీరు జొన్నబండ క్వారీ గుంతల్లో బట్టలు ఉతకడానికి వెళ్ళారు. వనిత ప్రమాదవశాత్తు కాలు జారి గుంతలో పడి మునిగిపోయింది. ఆమెను కాపాడేందుకు నరసింహ గుంతలో దిగి మునిగిపోయాడు.
కొద్దిసేపటి అనంతరం వనిత మృతదేహం పైకి తేలింది. స్థానికుల సమాచారంతో అల్వాల్ ఎస్ఐ రాంబాబు సంఘటనా స్థలానికి చేరుకుని వనిత మృతదేహాన్ని బయటకు తీయించారు. నరసింహ కోసం గాలించినా ప్రయోజనం కనిపించలేదు. వనిత పుట్టుకతో మూగ. నరసింహ గతంలో ఒకసారి ఆత్మహత్యాయత్నం చేశాడని, ఈ క్రమంలో అతడి శరీరం చాలావరకు కాలిపోయిందని పోలీసులు పేర్కొన్నారు. భిక్షాటన చేస్తూ వీరు ఇద్దరు పిల్లలను హాస్టల్లో చదివిస్తున్నారని చెప్పారు.