అసభ్య పదజాలంతో యువతికి మెసేజ్లు: న్యాయవాదిపై నిర్భయ కేసు
హైదరాబాద్: ఢిల్లీకి చెందిన ఓ యువతిపై హద్దులు దాటి ప్రవర్తించిన ఓ న్యాయవాది చిక్కుల్లో పడ్డాడు. తనను మిత్రుడ్ని చేసుకోవాలంటూ వేధించాడు. ఆమె అందుకు తిరస్కరించింది. దాంతో అసభ్య పదజాలంతో మెసేజ్ పెట్టాడు.
అతడి వేధింపులు భరించలేని ఆమె హైదరాబాద్ నగర షీ టీమ్స్కు పిర్యాదు చేసింది. దాంతో వారు రంగంలోకి దిగారు. గచ్చిబౌలిలో జరగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఢిల్లీ యువతిని వేధించిన న్యాయవాదిపై షీ టీమ్స్ పోలీసులు నిర్భయ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బర్కతపురకు చెందిన న్యాయవాది ఎం.అభిషేక్, అతడి స్నేహితుడు కలిసి మీడియా పేరుతో ఆమెతో మాట్లాడాలని ప్రయత్నించారు.
ఆమె స్పందించకపోవడంతో అక్కడే ఉన్న ఆమె బిజినెస్ కార్డు తీసుకున్నారు. తనను ఫ్రెండ్ చేసుకోవాలని న్యాయవాది అభిషేక్ ఆమెకు మెసేజ్ పంపాడు. ఆమె సమాధానం ఇవ్వకపోయేసరికి అసభ్య పదజాలంతో మెసేజ్లు పంపుతూ ఎంజాయ్ చేస్తున్నాడు.
అభిషేక్ వేధిస్తున్న విషయాన్ని ఆమె తన స్నేహితులకు తెలిపింది. వారు కూడా అతడికి ఫోన్ చేసి వేధించవద్దని హెచ్చరించారు. అయినా వేధింపులు ఆపకుండా ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. చివరకు ఆమె హైదరాబాద్ షీ టీమ్స్కి ఫిర్యాదు చేసింది. నిందితుడిపై సైబర్ క్రైం సీసీఎస్ పోలీసులు నిర్భయయాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు.