దెబ్బకు దెబ్బతో హైడ్రామా: ఓటుకు నోటుXఫోన్ ట్యాపింగ్.. తెరపైకి 'పెందుర్తి'!
హైదరాబాద్: చాలా రోజుల తర్వాత ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో మరోసారి చర్చనీయాంశమయ్యాయి.
టిడిపి యువనేత లోకేష్ డ్రైవర్కు తెలంగాణ ఎసిబి నోటీసులు ఇవ్వడం, వెంటనే మత్తయ్య బెదిరింపుల కేసులో తెలంగాణ మంత్రి కెటిఆర్ గన్మన్, డ్రైవర్కు ఏపీ సీఐడి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైంది. అదే సమయంలో పెందుర్తి కేసు ఘటన తెరపైకి రావడం గమనార్హం.
2013లో విశాఖ జిల్లా పెందుర్తిలో నమోదైన హత్యాయత్నం కేసులో కెటిఆర్ ముఖ్య అనుచరుల సంబంధీకులకు నోటీసులు జారీ చేశారు. అందులో తెలంగాణ సిఎం కెసిఆర్ వ్యక్తిగత గన్మెన్ మధుసూదన్ రెడ్డి, మరో వ్యక్తి సతీష్ రెడ్డిలకు నోటీసులు జారీ అయ్యాయి.
ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో పరస్పర నోటీసుల నేపథ్యంలో పెందుర్తి ఘటన కేసు బయటకు వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెందుర్తి ఘటనలో గతంలో పలుమార్లు విచారణహు హాజరు కావాలని నోటీసులు పంపించారు. ఇప్పుడు టాస్క్ ఫోర్స్ నేరుగా నోటీసులు హైదరాబాదుకు తెచ్చి ఇచ్చింది. మూడు రోజుల్లో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని పేర్కొంది.

కాగా, ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ అంశాల్లో రెండు రోజులుగా హైడ్రామా చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు వేడి పుట్టించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల ఇంటి ముందు భద్రతను పెంచారు.
ఇద్దరు ముఖ్యమంత్రుల కుమారులకు పరస్పరం నోటీసులు జారీ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఉమ్మడి రాజధానిలో బుధవారం అర్ధరాత్రి వరకూ రాజకీయ దుమారం కొనసాగింది.
మంగళవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లోని చంద్రబాబు నివాసం వద్దకు వచ్చారు. ఈ ఇద్దరు వ్యక్తులు తాము పోలీస్ శాఖ అని పరిచయం చేసుకొని సెక్యూరిటీతో కాసేపుమాట్లాడారు. తర్వాత వారి అనుమతితో చంద్రబాబు నివాసం వద్దకు వచ్చారు.
అక్కడ విధుల్లో ఉన్న ఏపీ పోలీస్ సిబ్బందితో మాట్లాడారు. పలు వివరాలు అడిగారు. ఈ విషయాన్ని ఏపీ పోలీస్ సిబ్బంది లోపల ఉన్న సీఎం భద్రతాధికారులకు తెలిపారు. వారు ఆ ఇద్దర్నీ లోపలకు పిలిచి అడగ్గా.. తాము ఏసీబీ నుంచి వచ్చామని చెప్పారని తెలుస్తోంది.
వారిద్దరినీ భద్రతాధికారులు సోదా చేస్తే వారు నమోదు చేసుకొన్న వివరాల కాగితాలు లభ్యమయ్యాయని తెలుస్తోంది. తమ అనుమతి లేకుండా సీఎం నివాసం వద్దకు వచ్చి ఇవన్నీ రాసుకోవడం ఏమిటని భద్రతాధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉన్నతాధికారులు చెబితే వచ్చామని వారు చెప్పారని తెలుస్తోంది. అనంతరం చంద్రబాబు భద్రతాధికారులు తెలంగాణ ఏసీబీలో కొందరు ఉన్నతాధికారులకు ఫోన్ చేసి దీనిపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారని తెలుస్తోంది.
దీనిపై ఎసిబి అధికారులు... తమకు ఆ విషయం తెలియదని, క్షమాపణ చెప్పినట్లుగా కూడా వార్తలొస్తున్నాయి.
అనంతరం మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ ఏసీబీకి చెందిన ఇద్దరు ఎన్టీఆర్ భవన్ వద్దకు వచ్చారు. గేటు బయట ఉన్న భద్రతా సిబ్బందిని కలిసి బాబు తనయుడు లోకేశ్ కాన్వాయ్ డ్రైవర్ కొండల్ రెడ్డి గురించి అడిగారు. అనంతరం ఆయనకు నోటీసులు ఇచ్చారు.
తెలంగాణ ఏసీబీ అధికారులు లోకేశ్ డ్రైవర్కు నోటీసులివ్వడంతో ఏపీ సీఐడీ వెంటనే స్పందించింది.తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గన్మెన్, డ్రైవర్కు నోటీసులు జారీ చేసింది. అయితే, ఆ నోటీసులు అందించేందుకు విజయవాడ నుంచి సీఐడీ డీఎస్పీ షేక్ షా వలి హైదరాబాదు వచ్చారు.
సీఎం కార్యాలయానికి, కేటీఆర్ నివాసానికి, నిఘా-భద్రతా విభాగం కార్యాలయానికి వెళ్లగా కేటీఆర్ గన్మెన్, డ్రైవర్ అందుబాటులోకి రాలేదు. దాంతో, గురువారం వారి ఇళ్ల చిరునామా తెలుసుకుని, అక్కడికి వెళ్లి నోటీసులు అందజేయాలని నిర్ణయించుకున్నారు. ఇలా హైదరాబాద్లో డ్రామా కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications