ఓటుకు నోటు ట్విస్ట్: కరీంనగర్ రైతుకు ఎసిబి నోటీసు, తన ఫోన్ పోయిందని వివరణ
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఆసక్తికర అంశం చోటు చేసుకుంది! ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఓ రైతుకు తెలంగాణ రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) నోటీసులు ఇచ్చింది. అయితే, ఆ వ్యక్తి రెండేళ్ల క్రితమే సెల్ఫోన్ పోగొట్టుకోవడం గమనార్హం.
ఓటుకు నోటు కేసులో సెల్ఫోన్ నెంబర్ ఆధారంగా కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన పాలకుర్తి రాములు అనే రైతుకు ఎసిబి నోటీసులు జారీ చేసింది. బుధవారం నాడు (రేపు) తమ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు.
పాలకుర్తి రాములు పేరు మీద ఉన్న సిమ్ కార్డుతో ఓటుకు నోటు కొనుగోలు లావాదేవీలు నడిచినట్లు తేలడంతో సెక్షన్ 160 సిఆర్పీసి కింద ఏసిబి ఆయనకు నోటీసులు జారీ చేసింది.
దీనిపై పాలకుర్తి రాములు స్పందించారు. ఓటుకు నోటు కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. సెల్ఫోన్ నంబర్ తనదేనని, కాని తన ఫోన్ రెండు సంవత్సరాల క్రితం పోయిందని చెప్పాడు. ఫోన్ పోయిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నాడు. ఆ సిమ్ ఇంకా తనపేరు మీద ఉన్నట్లు తనకు తెలియదని చెప్పాడు.