కేసీఆర్కు షాక్!: చాకులాంటి వారిని దింపినా, రేవంత్ రెడ్డికే ఊరట
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి సుప్రీం కోర్టులో ఊరట లభించింది. రేవంత్ బెయిల్ రద్దు చేయాలన్న ఏసీబీ పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. తద్వారా ఎలాగైనా మళ్లీ జైలుకు పంపించాలన్న టీఆర్ఎస్ ఆశలు అడియాసలయ్యాయని అంటున్నారు.
తొలి నుంచి రేవంత్ రెడ్డిది దూకుడే. ఆయన దూకుడును తట్టుకోలేకనే కేసీఆర్ కుట్రపూరితంగా పక్కా ప్రణాళికతో, యావత్తు ప్రభుత్వ యంత్రాంగాన్ని దింపి అరెస్టు చేయించాలని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు సుప్రీం కోర్టులో చుక్కెదురు కావడంతో టీటీడీపీ నేతలు కేసీఆర్ పైన ఎదురు దాడికి దిగుతున్నారు.
రేవంత్ రెడ్డి బెయిల్ను ఎలాగైనా రద్దు చేయించాలనే బలమైన ఉద్దేశ్యంతో తెలంగాణ ఏసీబీ లేదా టీఆర్ఎస్ ప్రభుత్వం మహామహులైన లాయర్లను రంగంలోకి దింపింది. కపిల్ సిబాల్, దుష్యంద్ దవే, హరేన్ రావెల్ వంటి మహామహులు రంగంలోకి దిగారు. అయినప్పటికీ చుక్కెదురయింది.
ఒకరోజు జైలులో ఉంటే పరిశీలించవచ్చునని, కస్టడీకి తీసుకొని విచారించారని, వాంగ్మూలం తీసుకున్నారని, హైకోర్టు తీర్పుపై ఈ పరిస్థితుల్లో కలుగజేసుకోలేమని న్యాయస్థానం చెప్పింది. దీంతో తెలుగు తమ్ముళ్ల సంబరాలు అంబరాన్ని అంటాయి. రేవంత్ తెలంగాణ పులిబిడ్డ అన్నారు. జైలుకు వెళ్లి వచ్చాక కూడా రేవంత్ కేసీఆర్ పైన దూకుడు తగ్గించలేదు. పైగా పెంచినట్లుగా కనిపిస్తోంది.