రేవంత్ కేసీఆర్నే బెదిరిస్తున్నారు: సుప్రీంలో ఏసీబీ, మళ్లీ జైలు: లక్ష్మారెడ్డి
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును బెదిరించేలా మాట్లాడారని తెలంగాణ ఏసీబీ గురువారం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సిన్హాలకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని ఏసీబీ పిటిషన్ దాఖలు చేసింది. అందులో.. రేవంత్ ముఖ్యమంత్రినే అంతు చూస్తానని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. బెయిల్ రాగానే రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే కేసులో సాక్ష్యాధారాలు తారుమారు చేయగలడనిపిస్తోందన్నారు.
రేవంత్ సహా ముగ్గురికి ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరారు. లేదంటే వారు సాక్ష్యులను ప్రభావితం చేస్తారన్నారు. అలాగే మనీ లాండరింగ్ పైన విచారణ జరపవలసి ఉందన్నారు. రూ.50 లక్షలు ఎక్కడి నుండి వచ్చాయి? మిగతా రూ.4.50 కోట్లు ఎక్కడున్నాయి? తెలుసుకోవాల్సి ఉందన్నారు.
రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారు: మంత్రి లక్ష్మా రెడ్డి
రేవంత్ రెడ్డి మితిమీరి ప్రవర్తిస్తున్నాడని మంత్రి లక్ష్మా రెడ్డి మండిపడ్డారు. ఇవాళ బెయిల్ వచ్చిందని చంకలు గుద్దుకోవడం సరికాదన్నారు. రేవంత్ మళ్లీ జైలుకెళ్లే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి చంద్రబాబు అని మండిపడ్డారు.
తెలంగాణ వ్యతిరేకులకు రేవంత్ ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. పాలమూరు జిల్లాను చంద్రబాబు తన హయాంలో దత్తత తీసుకుని వలసలు పోయేలా చేశాడన్నారు. చంద్రబాబు అవినీతిని లీగలైజేషన్ చేశాడని విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతలను చంద్రబాబు అడ్డుకుంటే రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డు చెప్పలేదన్నారు.
పాలమూరు జిల్లా ప్రజలు రేవంత్ రెడ్డిని చూసి నవ్వుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బుద్ది తెచ్చుకుని మాట్లాడాలన్నారు. కేసీఆర్ పైన ముప్పయ్యేళ్లు పోరాడుతానని చెప్పడం ద్వారా, ఆయన అంతకాలం సీఎంగా ఉంటారని రేవంత్ అంగీకరించారన్నారు.