మహిళా సర్పంచ్ పై పంజా విసిరిన కుల రక్కసి..! ఖమ్మం జిల్లాలో సభ్య సమాజం సిగ్గు పడే ఘటన..!!
ఖమ్మం/హైదరాబాద్ : ఆ గ్రామంలో కులం వికటాట్టహాసం చేసింది. కుల రక్కసి విశ్రుంఖలంగా ప్రవర్తించింది. సంర్పంచ్ పదవిలో ఉన్న ఓ మహిళపై దారుణంగా పంజా విసిరింది. కరుడుగట్టిన రాజకీయాల మద్య ఓ అభాగ్యురాలు నలిగి నరకం చూసింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఆ పదవికి ఎన్నికయ్యారు ఆ మహిళ. ఆమె సామాజిక వర్గానికి చెందిన కొందరితో కలిసి గ్రామానికే చెందిన టీఆర్ఎస్ నేతలు తమ పార్టీలోకి మారాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చారు. బెదిరింపులకు గురిచేశారు! చివరికి దాడికి కూడా పాల్పడ్డారు. అయినా ఆమె ఒప్పుకోలేదు. తాను కాంగ్రె్సను వీడేదిలేదంటూ స్పష్టం చేసింది. అంతే.. తీవ్ర ఆగ్రహానికి గురైన వారంతా ఆమెను కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
మహిళా సర్పంచ్ కుల బహిష్కరణ..! టీఆర్ఎస్ కు చెందిన కుల పెద్దల చర్య..!!
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం ఊట్కూరు గ్రామ సర్పంచ్కు ఎదురైన పరిస్థితి ఇదీ! బాధితురాలు పేరు పొడెం సులోచన. సోమవారం ఆమె తనకు ఎదురైన తీవ్ర అవమానకర పరిస్థితులను చెప్పుకొన్నారు. ఆమె వెల్లడించిన వివరాల ప్రకారం... ఊట్కూరు పంచాయతీ రిజర్వేషన్ను ఈసారి ఎస్టీకి కేటాయించారు. అదే పంజాయతీ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందడం ఆమె చేసిన నేరంగా ప్రత్యర్థి పార్టీ నేతలు కక్ష్య కట్టారు.
కాంగ్రె్సను వీడాలని ఆమెపై ఒత్తిడి, దాడి..! ససేమిరా అన్న సర్పంచ్.. నేతల ఆగ్రహం..!!
కోయ సామాజిక వర్గానికి చెందిన పొడెం సులోచనను కాంగ్రెస్ బలపరిచి సర్పంచ్గా నిలబెట్టింది. ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిపై ఆమె విజయం సాధించారు. కొన్నాళ్లుగా పార్టీ మారాలంటూ ఆమెపై ఒత్తిడి మొదలైంది. గ్రామంలో సమీకరణాలు మారాయి. నువ్వు కూడా కాంగ్రె్సను వీడి టీఆర్ఎస్ లో చేరాలంటూ గ్రామానికి చెందిన ఆ పార్టీ నాయకులు ఏపూరి పాపారావు, కొనకంచి శంకర్, సుధాకర్.. ఆమె కులపెద్దలు బొర్ర వెంకటేశ్వర్లు, గుంపెనపల్లి వెంకటేశ్వర్లు, ఈసం బాస్కర్, కల్లి రాంప్రసాద్ ఆమెను బెదిరించారు.
ఆమెతో పాటు ఏడు కుటుంబాలపై వేటు..! ఇంకా ఏంటి వింతాచారం అంటున్న హేతువాదులు..!!
కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిగా తాను గెలిచానని, పార్టీ మారే ప్రసక్తి లేదని సులోచన స్పష్టం చేశారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కులపెద్దలు.. గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ నేతల సమక్షంలో నువ్వు మా కులంలో ఉండొద్దు. నీతో పాటు మీ ఏడు కుటుంబాలను కులం నుంచి బహిష్కరిస్తున్నాం.. అని సులోచనను ఉద్దేశించి ప్రకటించారు. కాగా కులం నుంచి బహిష్కరించడమే కాకుండా తనపై దాడి కూడా చేశారని సులోచన వాపోయారు. ఘటనపై కామేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఖమ్మం జిల్లా ఊట్కూరులో ఘటన..! కుల పెద్దలపై చర్యలు తీసుకోవాలంటున్న బాదితురాలు..!!
సర్పంచ్ను, ఆమె కుటుంబసభ్యులను, ఆమె బంధువర్గానికి చెందిన ఏడు కుటుంబాలను కులం నుంచి బహిష్కరించిన వారిపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ సభ్యుడు చీమల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కులం నుంచి గ్రామ ప్రథమ పౌరురాలిని బహిష్కరించడం దారుణమని ఈ ఘటనపై పోలీసులు స్పందించాలని కోరారు. సమాజం విశ్వనగరం వైపు పరుగులు తీస్తున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి సంఘటనలు జరగడం, కులరక్కసి ఇంకా వికటాట్టహాసం చేయడం సమాజంలో మన పురోభివ్రుద్దిని చాటుతోందని పలువురు విశ్లేషిస్తున్నారు.