తెలంగాణలో కులగణన చారిత్రకం, రాహుల్ మాట నెరవేరుస్తాం: రేవంత్ రెడ్డి
భారత్ జోడో యాత్ర ఎంతోమందిని కదిలించిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేస్తున్నామని తెలిపారు. ఇందిరాగాంధీ 'గరీబ్ హఠావో' అనే నినాదంతో చరిత్రలో నిలిచారని అన్నారు. కులగణనపై ప్రభుత్వం హైదరాబాద్ బోయిన్పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్లో ప్రత్యేక సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉద్యోగ, ఉపాధి కులగణన సర్వేను ప్రభుత్వం బాధ్యతగా భావించిందన్నారు. పౌర సమాజం నుంచి సూచనలు తీసుకోవడానికి రాహుల్ గాంధీ ఇక్కడకు రావడం గొప్ప విషయమని.. ఈ నిర్ణయం తీసుకోవాలంటే గుండె ధైర్యం కావాలన్నారు.

విద్య, వైద్యం, ఉద్యోగం, సామాజిక న్యాయం ప్రజలకు అందించాలని రాహుల్ గాంధీ అడుగు ముందుకు వేశారని.. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను వేరవేర్చడమే మన కర్తవ్యమని సీఎం రేవంత్ అన్నారు. కులగణన పూర్తి చేసి బీసీలకు న్యాయంగా అందాల్సిన రిజర్వేషన్లను అందిస్తామని సీఎం రేవంత్ తెలిపారు. కులగణను 2025 జనగణనలో పరిగణలోకి తీసుకోవాలని ఈ వేదికపై తీర్మానం చేస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు.
తెలంగాణ దేశానికే ఆదర్శం: రాహుల్
తెలంగాణ రాష్ట్రంలో జరిగే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. హైదరాబాద్ బోయిన్పల్లిలోని గాందీ ఐడియాలజీ సెంటర్లో కులగణనపై ఏర్పాటు చేసిన సదస్సుకు రాహుల్ గాంధీ హాజరై ప్రసంగించారు. కులగణనను ఎక్స్రేతో పోల్చుతానని ఆయన అన్నారు. ఈ కాన్సెప్ట్ సెన్సెస్ ద్వారా దళితులు, ఓబీసీలు, మహిళల సంఖ్యపై స్పష్టత వస్తుందని తెలిపారు.
కులవ్యవస్థ ఉన్నప్పుడు అసమానతలు ఎక్కువగా ఉంటాయని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. అంటరానితనం భారత్లో తప్ప ఈ ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. దేశం ఆర్థికంగా ఎదగాలంటే కులవివక్ష ఉండకూడదని అభిప్రాయపడ్డారు. కులగణనలో కొన్ని పొరపాట్లు జరగవచ్చని వాటిని సరిదిద్దుతామని స్పష్టం చేశారు.
రిజర్వేషన్ల పరిమితిని తీసేస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తెలంగాణలో జరిగే కులగణన దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కులగణనలో ఏ ప్రశ్నలు అడగాలనేదానిపై సామాన్యులే నిర్ణయించాలని ఆయన పేర్కొన్నారు. దేశంలో కులవ్యవస్థ ఉందని ఒప్పుకొందామన్నారు రాహుల్ గాంధీ.
తాను దేశాన్ని విభజించే ప్రయత్నం చేస్తున్నానని కొందరు ఆరోపణలు చేస్తున్నారని రాహుల్ మండిపడ్డారు. దేశం గురించి నిజం చెబితే దేశాన్ని విభజించడమా? అని ప్రశ్నించారు. ఈ కులగణన ద్వారా ఓబీసీలు, దళితులు, మహిళల సంఖ్యపై స్పష్టత వస్తుందన్నారు. ఈ కులగణన తర్వాత ఎవరి వద్ద ఎంత ఆర్థిక వనరులున్నాయో తెలుసుకుందామన్నారు. జనాభా తగ్గట్లు రిజర్వేషన్లు పెంచుతామన్నారు. కులగణన చేస్తామని పార్లమెంట్లో స్పష్టంగా చెప్పానని, ఇప్పుడు అమలు చేస్తున్నామని రాహుల్ చెప్పారు.












Click it and Unblock the Notifications