ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు: ఈసీకి కూటమి నేతల ఫిర్యాదుల వెల్లువ
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా సోమవారం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన సీఈసీ ఓపీ రావత్, ఇద్దరు కమిషనర్లతో కూడిన బృందం రాష్ట్రానికి చెందిన తొమ్మిది పార్టీల ప్రతినిధులతో నిర్వహించారు. ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులను ఈ సమావేశానికి ఆహ్వానించారు.
Recommended Video
ఎన్నికల సన్నద్ధతపై ఆయా పార్టీల అభిప్రాయాలు, అభ్యంతరాలపై అధికారులు చర్చించారు. టీఆర్ఎస్ నుంచి ఎంపీ వినోద్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి, జంధ్యాల రవిశంకర్, నిరంజన్, టీడీపీ నుంచి రావుల చంద్రశేఖర్రెడ్డి, బీజేపీ నుంచి నల్లు ఇంద్రసేనారెడ్డి, సుబ్రహ్మణ్యం, సీపీఐ నుంచి చాడ వెంకట్రెడ్డి, తక్కెలపల్లి శ్రీనివాసరావు, సీపీఎం నుంచి నంద్యాల నర్సింహారెడ్డి, వెంకటేశ్, వైసీపీ నుంచి రవికుమార్, సంజీవరావు సమావేశానికి వచ్చారు.
ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల వెల్లువ
బోగస్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సవరించిన ఓటర్ల జాబితా తప్పుల తడకగా ఉందని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సమావేశం అనంతరం తాము సీఈసీతో చెప్పిన విషయాలను ఆయా పార్టీల ప్రతినిధులు మీడియాకు వెల్లడించారు.
టీఆర్ఎస్ ఎంపీ వినోద్ మాట్లాడుతూ.. ఎన్నికల నియమావళి వల్ల ఇప్పటికే ఉన్న సంక్షేమ పథకాలను ఆపొద్దని కోరామని.. అలాంటి కార్యక్రమాలకు ఇబ్బంది ఉండదని సీఈసీ తెలిపారని చెప్పారు. మంత్రులు పర్యటనకు వెళ్తే కూడా చెల్లింపు కథనాలుగా ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు. ఏపీలో అధికారంలో ఉన్న తెదేపా మీడియాలో ప్రకటనలు ఇస్తోందని తెలిపారు. టీడీపీ ఇక్కడ బరిలో ఉన్నందున.. ఆ పార్టీ ప్రకటనలపై దృష్టి సారించాలని కోరామన్నారు.
ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు: రావుల
ఆపద్ధర్మ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్రెడ్డి ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీని ఇబ్బందులు పెడుతున్నారని, తమ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేసినట్టు రావుల తెలిపారు. సంబంధంలేని అంశంలో ఎల్ రమణను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అన్నారు. మలక్పేట నియోజకవర్గంలోని బోగస్ ఓట్ల వివరాలను కమిషన్కు అందించినట్టు తెలిపారు. ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అరికట్టాలని ఈసీని కోరినట్టు చెప్పారు.
బీజేపీ వాదన
కాగా, హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో బోగస్ ఓట్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని గతంలో చెప్పినా తీయలేదని బీజేపీ నేతలు సీఈసీ దృష్టికితీసుకెళ్లారు. ఎక్కువ ఓట్లు ఉన్న ఇళ్లను పార్టీల సమక్షంలో తనిఖీ చేసి తొలగిస్తామని సీఈసీ అధికారులు చెప్పారని తెలిపారు. డబ్బుల పంపకాన్ని అడ్డుకొనేందుకు అన్ని వాహనాలను తనిఖీ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్టు చెప్పారు. కొందరు అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని, కొన్ని ఛానెళ్లలో ఒకే పార్టీకి సంబంధించిన వార్తలను ఇస్తున్నారని అన్నారు. ఎక్కువ సార్లు వచ్చే వార్తలను చెల్లింపు వార్తలుగా పరిగణించాలని ఈసీని కోరినట్టు ఇంద్రసేనారెడ్డి తెలిపారు.
బోగస్ ఓటర్లకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా విజిలెన్స్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరినట్టు చెప్పారు. అధికార టీఆర్ఎస్ ఇప్పటికే ఒక్కో నియోజకవర్గానికి రూ.5 కోట్లు చేర్చినట్టు సమాచారం ఉందన్నారు. గతంలో డబ్బుతో పట్టుబడిన వారిని ఇంకా శిక్షించలేదని.. ఇలా అయితే ఏం లాభం ? అని ప్రశ్నించారు. ఒక్కో ఓటుకు రూ.2వేలు ఇచ్చేందుకు కొందరు నేతలు సిద్ధమవుతున్నారని ఆరోపిస్తూ ఆయన సీఈసీకి ఫిర్యాదు చేశారు.
మర్రి శశిధర్ రెడ్డి తీవ్ర స్పందన
రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులను సీఈసీకి వివరించినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహిస్తే ప్రజాస్వామ్యానికే మచ్చ అని చెప్పామన్నారు. ఓటర్లజాబితాలో అవకతవకలు ఉన్నాయని మొదట్నుంచీ తాము చెబుతున్నామని, జాబితాలో తప్పులు సరిచేశామని హైకోర్టుకు ఈసీ తెలిపిందన్నారు. అక్టోబర్ 12న తుది జాబితా అన్ని పార్టీలకూ ఇస్తామన్నారని గుర్తు చేశారు. ఓటర్ల జాబితా సరిచేయలేదని, అవసరమైన ఆధారాలను సీఈసీకి ఇచ్చామని చెప్పారు. గందరగోళపు జాబితాతో ఎన్నికలు నిర్వహించుకోవడం దురదృష్టకరమన్నారు. ఎన్నికల సంఘం వ్యవహారశైలి సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.