ఇంత దారుణమైన పరిస్థితుల్లో పుట్టినరోజు వేడుకలా.?నో బర్త్ డే సెలబ్రేషన్స్ అంటున్న షర్మిళ.!
హైదరాబాద్ : వియ్యానికైనా కయ్యానికయినా కారణం ఉండాలన్నట్టే పుట్టిన రోజు వేడులకు జరుపుకోవడానికి కూడా ఓ సమయం సందర్బం ఉండాలంటున్నారు తెలంగాణ వైయస్సార్ పార్టీ అధినేత్రి శ్రీమతి వైయస్ షర్మిళ. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా రైతులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, ఈ సందర్బంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సమంజసం కాదంటున్నారు శ్రీమతి షర్మిళ. ఒక్క రైతాంగమే కాకుండా నిరుద్యోగులు, విద్యార్ధిలోకం, మహిళలు అన్నీ వర్గాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారని ఇలాంటి విచారకర పరిస్ధితుల మధ్య మద్య బర్త్ డే జరుపుకోవడం బాద్యతారాహిత్యంగా ఉంటుందని, అందుకే రైతు ఆత్మహత్యలకు, నిరుద్యోగుల ఆత్మహత్యలకు నిరసనగా జన్మదిన వేడుకలను రద్దు చేసుకుంటున్నట్టు శ్రీమతి షర్మిళ ప్రకటించారు.

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిళ బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల అంటే డిసెంబర్ 17వ తేదీన తన పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా జన్మదిన వేడుకలను నిర్వహించొద్దని సూచించారు షర్మిళ. ఇటీవల కాలంలో ఐకేపీ సెంటర్లు ఉండబోవని అధికార పార్టీ చెప్పడం, వానాకాలం వడ్ల కొనుగోలులో జాప్యంతో రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని షర్మిళ ఆవేదన వ్యక్తం చేసారు. గత 70 రోజుల్లోనే 206 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, 37 రోజుల్లో 34 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల దృష్ట్యా పుట్టిన రోజు వేడుకలను జరుపుకోవడం లేదని, పుట్టిన రోజు వేడుకలకు బదులు వీలైతే సేవా కార్యక్రమాలు చేస్తూ, రైతులకు భరోసా కల్పించాల్సిందిగా వైయస్ఆర్ అభిమానులకు, వైయస్సార్ తెలంగాణ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు షర్మిళ పిలుపునిచ్చారు.
Recommended Video



Click it and Unblock the Notifications