సచివాలయ నిర్మాణం కోసం 'బైసన్ పోలో' గ్రౌండ్ ఇవ్వడానికి సిద్దమన్న రక్షణశాఖ..
60ఎకరాల్లో ఉన్న బైసన్ పోలో గ్రౌండ్ ను ప్రభుత్వానికి అప్పగించేందుకు రక్షణశాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం.
హైదరాబాద్: సచివాలయ నిర్మాణం కోసం తెలంగాణ సర్కార్ చేసిన విన్నపం మేరకు 60ఎకరాల్లో ఉన్న బైసన్ పోలో గ్రౌండ్ ను ప్రభుత్వానికి అప్పగించేందుకు రక్షణశాఖ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీంతో పాటు మరో వంద ఎకరాల స్థలాన్ని కేటాయించడానికి రక్షణ శాఖ సానుకూలంగా స్పందించనట్లు తెలుస్తోంది.
ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తరుపున ఉన్నత స్థాయి అధికారి ఒకరు ఢిల్లీలోని రక్షణ శాఖ అధికారులతో చర్చలు జరిపినట్లు సమాచారం అందుతోంది. అదే సమయంలో రక్షణ శాఖ కోసం తెలంగాణ సర్కార్ వెయ్యి ఎకరాలను కేటాయించడానికి సన్నద్దమవుతున్నట్లు చెబుతున్నారు.
ఇందుకోసం వనపర్తి, నిజామాబాద్ జిల్లాల్లో స్థలాన్ని చూపించనున్నట్లు సమాచారం. ఇకపోతే పారడైజ్ నుంచి షామీర్ పేట్ ఓఆర్ఆర్ వరకు ఫ్లై ఓవర్ నిర్మించేందుకు రక్షణశాఖ అనుమతినిచ్చినట్లు తెలుస్తోంది. ఈ మార్గంలో రక్షణశాఖ స్థలం ఉండటంతో.. ప్రభుత్వం వారి అనుమతి కోరినట్లు చెబుతున్నారు.