మేడారం జాతరకు కేంద్రం నిధులు
తెలంగాణ కుంభమేళ మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. మేడారం జాతర నిర్వహణకు గానూ కేంద్రం రూ. 3 కోట్లు కేటాయించినట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి రూ.2.30 కోట్లు, కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నుంచి రూ. 0.84 కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది.
తెలంగాణలోనే గాక, చుట్టుపక్కల రాష్ట్రాలలో ఎంతో ప్రాధాన్యత కలిగిన, గిరిజన కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ "సమ్మక సారక్క మేడారం జాతర" నిర్వహణకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో.. కేంద్ర పర్యాటక, గిరిజన మంత్రిత్వశాఖలు కేటాయించిన రూ. 3.14 కోట్ల నిధుల విడుదలకు ఆయా మంత్రిత్వ శాఖలు ఆమోదం తెలిపాయి. ఇందులో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, పథకం పరిమితులకు మించి నిధుల విడుదలకు ఆమోదం తెలపడం విశేషం.

గతంలో కూడా మేడారంలో మౌలిక సదుపాయాల కల్పనకు, జాతర నిర్వహణకు కేంద్ర పర్యాటక, గిరిజన మంత్రిత్వశాఖలు సంయుక్తంగా రూ. 18.50 కోట్లను ఖర్చు చేశాయి. అంతేకాకుండా కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేడారం చుట్టుపక్కల ఉన్న ములుగు, లక్నవరం, మేడవరం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత వాటర్ ఫాల్స్ వంటి ప్రాంతాలలో పర్యాటకాన్ని ప్రోత్సహించడం కోసం "గిరిజన సర్క్యూట్ పేరిట" రూ. 80 కోట్లతో ఆయా ప్రాంతాలలో పర్యాటకులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా పలు అభివృద్ధి పనులను కూడా పూర్తి చేసింది.
అమ్మవార్లకు బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు తీర్చుకోవడానికి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి, రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం జాతర జరిగే నాలుగు రోజుల పాటు, దక్షిణ మధ్య రైల్వేశాఖ 30 ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతోంది. ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్కు మద్దతు అందించే TRIs పథకం కింద మేడారం జాతర నిర్వహణకు కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ అందించిన నిధులతో 4 రోజులపాటు 350 మంది నాట్యకారులతో జాతీయ గిరిజన నృత్య వేడుకలు నిర్వహించడం, బహుమతులు అందించడం, మ్యూజియం, ఓపెన్ ఆడిటోరియంలో సౌకర్యాల కల్పన ఏర్పాటు చేయడం జరుగుతుంది.

వీటితోపాటు రోజుకు 10 మంది చొప్పున 'కోయ ఇలావేల్పుల'ను పూజించడం, గౌరవించడం, గిరిజన ఉత్పత్తుల ప్రదర్శనలు ఏర్పాటు చేయడం, గిరిజన యువతకు సాధికారత కార్యక్రమాలు, ఏకలవ్య, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు గిరిజన కళలు, సాహిత్యం మీద పోటీలు నిర్వహించడం, కోయ గ్రామం నమూనాను పునరుద్ధరించడం, మ్యూజియం వద్ద పార్కు ఏర్పాటు, మేడారం జాతరను తెలియజేసేలా డాక్యుమెంటరీని రూపొందించడం, గిరిజన వంటకాలను ప్రదర్శించే స్టాళ్లను ఏర్పాటు చేయడం, పర్యాటకులను ప్రోత్సహించేలా ట్రైబల్ హోం స్టే లను ఏర్పాటు చేయడం, సోలార్ లైట్ల ఏర్పాటు, వెనుకబడిన గిరిజన జాతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పీఎం జన్ మన్ కార్యక్రమం, స్కాలర్ షిప్ లు, వివిధ పథకాల కింద గిరిజనులకు లభించే ఋణాలు, రక్తహీనత (సికిల్ సెల్ అనీమియా) తదితరాల మీద కరపత్రాలు, బ్యానర్లు, వీడియో ప్రదర్శనల రూపంలో అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించడం, హెల్త్ క్యాంప్ ను ఏర్పాటు చేయడం వంటి అనేక పనులను చేపట్టడం జరుగుతుంది.
సమ్మక్క సారక్క మేడారం జాతర వేడుకల నిర్వహణకు, భక్తుల రాకపోకలకు వీలుగా ప్రత్యేక రైళ్ల రూపంలో రవాణా సౌకర్యాలను ఏర్పాటుకు అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలను అందిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కాగా, మేడారం జాతరకు తెలంగాణ నుంచే గాక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు వచ్చి సమ్మక్క-సారక్కలను దర్శించుకుంటున్నారు.












Click it and Unblock the Notifications