'అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన కేసీఆర్.. ఆ పథకం దేశానికే ఆదర్శం'
డబుల్ బెడ్ రూమ్ పథకం ద్వారా సీఎం కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని కితాబిచ్చారు.
సిద్దిపేట: రాష్ట్రంలో ప్రతిపక్షాల విమర్శల సంగతెలా ఉన్నా.. కేంద్రం నుంచి మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా కేంద్రమంత్రి విజయ్ గోయల్ సీఎం కేసీఆర్ పనితీరును అభినందించారు. మంగళవారం నాడు సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో ఆయన పర్యటించారు.
పేద, మధ్య తరగతి ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని కేంద్రమంత్రి విజయ్ గోయల్ అన్నారు. తొలుత డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న డబుల్ బెడ్ రూమ్ పథకం దేశానికే ఆదర్శమని గోయల్ అభిప్రాయపడ్డారు. ఈ పథకం ద్వారా సీఎం కేసీఆర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారని కితాబిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రధాని మోడీతో చర్చిస్తామని అన్నారు.

కాగా, మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి మద్దతు తెలిపినందుకు గాను సీఎం కేసీఆర్ కు కేంద్రమంత్రి విజయ్ గోయల్ కృతజ్ఞతలు తెలియజేశారు. నేడు ఆయన వరంగల్ లక్నవరం చెరువును కూడా సందర్శించనున్నారు.
అంతకుముందు.. కేసీఆర్ తో విజయ్ గోయల్ భేటీ:
సోమవారం నాడు సీఎం కేసీఆర్ తో కేంద్రమంత్రి విజయ్ గోయల్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రాంతీయ క్రీడా కేంద్రంను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కేంద్ర మంత్రిని సీఎం కోరారు.
సీఎం విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్లో ప్రాంతీయ క్రీడాకేంద్రం ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు.












Click it and Unblock the Notifications