తెలంగాణలో ఆ మూడు టూరిజం సర్క్యూట్స్ అభివృద్దికి కేంద్రం నుంచి రూ.268 కోట్లు... : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణలో పర్యాటక రంగ అభివృద్దికి కేంద్రం ఇప్పటికే రూ.300 కోట్లు మంజూరు చేసిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. స్వదేశ్ దర్శన్,ప్రసాద్ పథకాల కింద కేంద్రం ఈ నిధులను కేటాయించిందన్నారు.స్వదేశ్ దర్శన్ పథకం కింద రాష్ట్రంలో మూడు టూరిజం సర్క్యూట్స్ అభివృద్దికి రూ.268.93కోట్లు,ప్రసాద్ పథకం కింద రూ.36.73కోట్లు కేటాయించినట్లు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన లేఖకు కిషన్ రెడ్డి ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
మూడు టూరిజం సర్క్యూట్స్లో భాగంగా మహబూబ్నగర్ జిల్లాలోని ఎకో సర్క్యూట్ కోసం 2015లో రూ.91.62 కోట్లు కేంద్రం మంజూరు.చేసిందన్నారు.ములుగు-లక్నవరం-మేడారం-తాడ్వాయి-దామరవి-మల్లూరు-బొగత ట్రూబల్ బెల్ట్ సర్క్యూట్ అభివృద్దికి 2016-17లో రూ.79.87కోట్లు మంజూరు చేసిందన్నారు. కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్-పైగా టూంబ్స్-హయత్ బక్షి మస్క్-రేమండ్స్ టూంబ్లను కలుపుతూ హెరిటేజ్ సర్క్యూట్ కింద 2017-18లో 96.90 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
ప్రసాద్ పథకం కింద ఆలంపూర్లోని జోగులాంబ అమ్మవారి ఆలయ అభివృద్దికి రూ.36.73కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్దికి మరిన్ని నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్దంగా ఉందన్నారు. రాష్ట్రం తగిన ప్రతిపాదనలు పంపిస్తే కేంద్రం వాటిని సమీక్షించి నిర్ణయం తీసుకుంటుందన్నారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న నిధుల విషయంలో టీఆర్ఎస్-బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. ప్రధానమంత్రి ఆవాస్ యోజనా వంటి పథకాలకు కేంద్రం నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటిని దారి మళ్లించిందని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. రైతుల కోసం ఫసల్ భీమా యోజనా పథకాన్ని తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వం అందుకు ప్రీమియం కూడా చెల్లించలేదని... దాంతో రైతులు నష్టపోతున్నారని మండిపడుతున్నారు. మరోవైపు టీఆర్ఎస్ బీజేపీ విమర్శలను తిప్పికొడుతోంది. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేవని... రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తున్న నిధుల్లో తిరిగి సగం కూడా రాష్ట్రానికి రావట్లేదని ఆరోపిస్తోంది.
తాజాగా గద్వాల సభలో కేటీఆర్ మాట్లాడుతూ... గత ఆరున్నరేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి అందిన ఆదాయం రూ.2.72లక్షల కోట్లు కాగా... కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది కేవలం రూ.1.42లక్షల కోట్లు మాత్రమేనని కేటీఆర్ అన్నారు.తాను చెప్పింది నిజం కాకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని... బండి సంజయ్ చెప్పింది అబద్దమైతే ఆయన రాజీనామా చేస్తారా... అని కేటీఆర్ సవాల్ విసిరారు.గద్వాల జిల్లా కేంద్రంలో పలు అభివృద్ది పనులకు కేటీఆర్ మంగళవారం శంకుస్థాపన,ప్రారంభోత్సవాలు చేశారు.బండి సంజయ్ చెబుతున్నట్లు రాష్ట్రంలో అమలవుతున్న అన్ని పథకాలకు కేంద్రమే నిధులు ఇస్తే... ఇక్కడున్న పథకాలు కర్ణాటకలో ఎందుకు లేవని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ ఆదాయాన్ని ఉత్తర ప్రదేశ్కు తరలిస్తున్నారని ఆరోపించారు. మన రక్తం, మన చెమటతో దేశంలోని వెనుకబడ్డ ఇతర రాష్ట్రాలకు కేంద్రం నిధులు తీసుకెళ్తోందన్నారు.తెలంగాణను ప్రధాని మోదీ దగా చేస్తున్నారని ఆరోపించారు. దొడ్డు ధాన్యం కొనేది లేదని కేంద్రం చెబుతోందని... కేంద్రంపై పోరాటాన్ని కొనసాగిస్తూనే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఐఐఎంలు, నవోదయ విద్యాలయాల కేటాయింపులో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం మొండిచేయి చూపిందన్నారు.