నరేంద్రమోడీ, అమిత్ షా వినడంలేదుకానీ.. KTR ఆలోచన చాలా బాగుంది!!
తెలంగాణ ఐటీ మంత్రి KTR ఆలోచన అమలుచేస్తే అన్ని రాష్ట్రాలకు ఆదాయం సమకూరుతుంది.. కొత్త పరిశ్రమలు పుట్టుకొస్తాయి.. సంపద సృష్టించినట్లవుతుందికానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం వినడంలేదు. మంచి మాటలు, మంచి సూచనలను ఎవరైనా ఇలాగే పెడచెవిన పెడతారంటూ టీఆర్ఎస్ శ్రేణులు విమర్శిస్తున్నాయి.
భూములను రాష్ట్ర ప్రభుత్వాలకే కేటాయించాలి
నష్టాలొస్తున్నాయన్న కారణంతో ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ అమ్మేస్తున్న సంగతి తెలిసిందే. అమ్మితే అమ్ముతున్నారుకానీ ఏ రాష్ట్రంలో సంస్థలను అమ్ముతుంటే ఆ సంస్థలకు చెందిన భూములను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే కేటాయించాలని KTR డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆయన ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. KTR ఆలోచన మంచిదని, ఆ భూములు రాష్ట్రాలకివ్వడమే ఉత్తమమని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు.
విశాఖ ఉక్కు భూముల విలువ రూ.2 లక్షల కోట్లు?
తెలంగాణలో ఉన్న ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, హెచ్ఎంటీ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సిసిఐ), హిందుస్థాన్ కేబుల్స్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కేంద్ర ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా అమ్మకానికి పెట్టింది. ఈ సంస్థలకు గతంలో ప్రభుత్వాలు 7200 ఎకరాల భూమిని కేటాయించింది.
ప్రభుత్వ ధరల ప్రకారమైతే వీటి విలువ రూ.5 నుంచి రూ.6వేల కోట్ల రూపాయల మధ్యలో ఉండగా, బహిరంగ మార్కెట్లో రూ.40 వేల నుంచి రూ.50వేల కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా వేస్తున్నారు. కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చే సంస్థలు కూడా కంపెనీలకన్నా ఆ భూములమీదే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయనేది నిర్వివాదాంశం. విశాఖ ఉక్కు కర్మాగారానికి సంబంధించిన భూముల విలువ బహిరంగ మార్కెట్లో రూ.2 లక్షల కోట్ల రూపాయలు ఉండొచ్చనే అంచనా ఉంది.
భూములను రాష్ట్రాలకే బదలాయించాలి!!
ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్రాలు కేటాయించిన భూముల్లో కొత్త పరిశ్రమలు, సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించాలి. లేదంటే ఆ భూములను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు బదలాయించి వాటి అభివృద్ధికి తోడ్పడాలని KTR డిమాండ్ చేస్తున్నారు. కానీ కేంద్రం తీరు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉందని, తెలంగాణకు అవసరమైన అప్పు తెచ్చుకోవాలన్నా రానివ్వకుండా చేస్తోందంటూ మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.