కోటి డిమాండ్, బాలుడి కిడ్నాప్ చేధించిన పోలీసులు: ఎన్నారై ఇల్లు చోరీ
హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధి చైన్ స్నాచర్ల అడ్డాగా మారింది. తాజాగా వనస్ధలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్జీఓస్ కాలనీలో వరలక్ష్మీ అనే మహిళ వృద్ధురాలిపై చైన్ స్నాచర్లు దాడి చేసి ఆమె మెడలోని 6 తులాల బంగారం గొలుసుని లాక్కెళ్లారు.
ఈ దాడిలో వృద్ధురాలి వరలక్ష్మీ మెడకు తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. సోమవారం ఉదయం ఇంటి బయట చెట్టుకున్న పూలు కోస్తున్న క్రమంలో వెనుక నుంచి బైక్పై వచ్చిన చైన్ స్నాచర్లు ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు.
దీంతో ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసుల్లో కొంత బంగారాన్ని లాక్కెళ్లగా, మరికొంత బంగారాన్ని ఆమె చేత్తో గట్టిగా పట్టుకున్నారు. ఈ క్రమంలో ఆమె మెడకు తీవ్ర గాయాలయ్యాయి. గతంలో కూడా ఇదే ప్రాంతంలో రమ్య అనే మహిళపై మధ్యాహ్నాం పూట చైన్ స్నాచర్లు దాడికి పాల్పడ్డారు.

ఉదయం వేళల్లో పోలీసులు బందోబస్తు ఉండదు కాబట్టి చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. స్ధానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ ప్రాంతంలోని సీసీ కెమెరా పుటేజీలను పరిశీలిస్తున్నారు.
స్ధానికులు మాత్రం తరుచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. పోలీసులు సైతం అన్ని రకాలుగా తాము నిఘాను పెంచుతున్నామన్నారు. కాలనీలో ఎక్కడికక్కడ సీసీ టీవీ కెమెరాలు పెట్టామన్నారు. చైన్ స్నాచర్ల ఆగడాలను అడ్డుకునేందుకు అన్ని విధాలా తీవ్ర ప్రయత్నం చేస్తున్నామన్నారు.
ఎల్బీనగర్ బాలుడి కిడ్నాప్ కేసుని చేధించిన పోలీసులు
రెండు రోజుల క్రితం ఎల్బీనగర్లోని హైవే కాలనీలో కిడ్నాప్కు గురైన బబ్లూ అనే ఏడేళ్ల బాలుడు కేసును పోలీసులు చేధించారు. బాలుడుని అపహరించిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శనివారం సాయంత్రం బబ్లూ అనే బాలుడిని కిడ్నాప్ చేసిన కిడ్నాపర్లు కుటుంబ సభ్యుల వద్ద నుంచి కోటి రూపాయాలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు అదుపులోకి తీసుకున్న కిడ్నాపర్లలో కర్నూలుకు చెందిన ఇద్దరితో పాటు కడప, హైదరాబాద్కు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు.
అయితే ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించిన పోలీసులు కూపీ లాగే పనిలో ఉన్నారు. ఒక ఛానల్లో పనిచేస్తున్న ఉద్యోగితో పాటు ఈ నలుగురు ఒక గ్యాంగ్గా ఏర్పడి కిడ్నాప్లు చేసినట్లు తెలుస్తోంది.
సాయంత్రం వీరిని మీడియాకు ముందుకు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
మలక్పేటలో భారీ చోరీ
నగరంలోని మలక్పేటలో భారీ చోరీ జరిగింది. వెంకటాద్రినగర్లోని ఎన్నారై షాన్వాజ్ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు కిలోబంగారం, మూడు లక్షల రూపాయల నగదును అపహరించుకువెళ్లారు. షాన్వాజ్, అతడి భార్య ఓ ఫంక్షన్కు వెళ్లి అర్థరాత్రి ఇంటికి తిరిగి వచ్చే సమయానికి కరెంట్ లేకపోవడంతో తలుపులు తెరిచి నిద్రపోయారు.
ఇదే అదునుగా భావించిన దుండగులు ఇంట్లోని నగదు, నగలను అపహరించుకుపోయారు. ఉదయం ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించిన షాన్వాజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications