ట్రిపుల్ మర్డర్స్: కూతురు, అత్తను చంపి టీవీ చూస్తూ.. అపర్ణ రాగానే విరుచుకుపడ్డాడు
హైదరాబాద్: నగరంలోని చందానగర్లో జరిగిన మూడు హత్యల కేసులో సోమవారం లొంగిపోయిన నిందితుడు మధు.. పోలీసుల విచారణలో హత్యకు సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించాడు.
చందానగర్ ట్రిపుల్ మర్డర్స్: ఆరోజు ఏం జరిగింది? నిందితుడు మధు ఏం చెప్పాడు?
తన ప్రియురాలు అపర్ణ, ఆమె తల్లి విజయలక్ష్మి, తమ కూతురు కార్తీకేయను దారుణంగా హత్య చేసినట్లు మధు అంగీకరించాడు.
టవల్తో ఊపిరాడకుండా చేసి..
హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులకు వెల్లడిస్తూ.. జనవరి 27న ఉదయం 11.30గంటలకు చందానగర్లోని అపర్ణ ఇంటికి వెళ్లినట్లు మధు తెలిపాడు. అక్కడ విజయలక్ష్మి తనను నిలదీసిందంటూ.. అపర్ణకు అన్యాయం చేయొద్దని కోరిందని తెలిపాడు. ఈ నేపథ్యంలో పెనుగులాట జరిగిందని చెప్పాడు. ఆ తర్వాత విజయలక్ష్మిని టవల్తో ఊపిరాడకుండా చేసి చంపేశానని మధు తెలిపాడు.
అమ్మమ్మను చంపొద్దంటున్న కూతుర్నీ..
కాగా, తన అమ్మమ్మను చంపొద్దంటూ తన కూతురు కార్తికేయ వేడుకున్నా మధు వినిపించుకోలేదు. అనంతరం అదే కోపంలో కన్న కూతురు అని కూడా చూడకుండా కార్తీకేయను కూడా గొంతునులిమి చంపేశాడు ఆ దుర్మార్గుడు. ఆ తర్వాత అనుమానం రాకుండా వారిని బెడ్పై పడుకోబెట్టాడు మధు. అనంతరం హాలు టీవీ చూస్తూ కూర్చుండిపోయాడు.
అపర్ణ రావడంతోనే..
శనివారం మధ్యాహ్నం 3గంటల సమయంలో విధులు ముగించుకుని వచ్చిన అపర్ణ.. కూతురు, తల్లి మృతి చెందడంతో మధుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో అపర్ణను వంటగదిలో బలమైన వస్తువుతో బాది, గోడకేసి కొట్టాడు మధు. దీంతో ఆమె పెద్ద కేకలు వేస్తూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.
కేకలు విన్న పొరుగు మహిళ.. తాళం వేసి వెళ్లాడు
కాగా, అపర్ణ కేకలు విన్న పొరుగు మహిళ.. అపర్ణ ఇంటి వద్దకు రాగా.. లోపలికి గడియి పెట్టి ఉండటం, టీవీ సౌండ్ వినిపించడంతో ఆమె తిరిగి వెళ్లిపోయింది. ముగ్గురిని హత్య చేసిన హంతకుడు మధు.. ఆ తర్వాత సాయంత్రం 5.30గంటల ప్రాంతంలో అపర్ణ ఇంటికి తాళం వేసి అక్కడ్నుంచి పరారయ్యాడు.
దుర్వాసన రావడంతో..
అపర్ణ రెండ్రోజులైనా బయటికి రాకపోవడం, తాళం వేసి ఉన్న వారింట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా.. ముగ్గురి మృతదేహాలు కనిపించాయి.
విసుగు, ఒత్తిళ్లు, అనుమానం
అపర్ణ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానం, అపర్ణతోపాటు విజయలక్ష్మి విసిగిస్తుండేవారని, వారి ఒత్తిళ్లు తట్టుకోలేకనే చంపేశానని పోలీసులకు లొంగిపోయిన హంతకుడు మధు తెలిపాడు. కాగా, నిందితుడు మధును మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
అపర్ణ కుటుంబ హత్యకు మధు మొదటి భార్యే కారణం
మధు మొదటి భార్య, ఆమె బంధువుల కారణంగానే అపర్ణ కుటుంబం హత్యకు గురైందని, అతని భార్య ఒత్తిడి వల్లే మధు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని అపర్ణ బంధువులు ఆరోపిస్తున్నారు. అపర్ణ కూతురుకు కూడా ఆస్తి పంచాల్సి వస్తుందనే నెపంతోనే మధు, అతని భార్య, బంధువులు అపర్ణ, ఆమె తల్లి, కూతురును హత్య చేశారని ఆరోపించారు. అపర్ణతో మధు సుమారు పదేళ్లుగా సహజీవనం చేస్తున్న విషయం అతని మొదటి భార్యకు ఇంతకుముందే తెలుసునని చెప్పారు.