హరికృష్ణ మృతి తీరనిలోటు: షాకయ్యామంటూ చంద్రబాబు, కేసీఆర్, జగన్ దిగ్భ్రాంతి
హైదరాబాద్: మాజీ సీఎం ఎన్టీఆర్ తనయుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హరికృష్ణ మరణవార్త విని షాక్కు గురయ్యానని అన్నారు. హరికృష్ణ మృతి టీడీపీకే కాదు, రాష్ట్రానికే తీరని లోటు అన్నారు. ఆయన లేని లోటు పూడ్చలేనిదని విచారం వ్యక్తం చేశారు.
నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారని, సాంఘిక ,పౌరాణిక, చారిత్రక పాత్రల పోషణలో హరికృష్ణది అందెవేసిన చేయి అని కొనియాడారు. చలనచిత్ర రంగానికి, రాజకీయ రంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారన్నారు. నందమూరి తారకరామారావుకు ఆయన అత్యంత ఇష్టుడు అని, ఎన్టీఆర్ చైతన్య రథసారథిని స్వయంగా డ్రైవింగ్ చేస్తూ ఎన్టీఆర్ను ప్రజలకు చేరువ చేశారని గుర్తుచేశారు.
హరికృష్ణ నిరాడంబరుడు, నిగర్వి, స్నేహానికి మారుపేరు అయిన హరికృష్ణను కోల్పోవడం బాధాకరమన్నారు. బుధవారం నాటి కార్యక్రమాలను చంద్రబాబు రద్దు చేసుకున్నారు. చంద్రబాబు, మంత్రి లోకేశ్ సంతాపం ప్రకటించారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే వారు ప్రత్యేక హెలికాప్టర్లో హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు.

కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి
హరికృష్ణ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. హరికృష్ణ మృతి పట్ల మంత్రులు హరిశ్రావు, తలసాని శ్రీనివాస్యాదవ్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి తదితరులు సంతాపం ప్రకటించారు.
Recommended Video

షాక్కు గురయ్యానంటూ జగన్
విశాఖపట్నం: నందమూరి హరికృష్ణ మృతిపట్ల వైయస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. హరికృష్ణ అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందడం తనకు షాక్కు గురిచేసిందని తెలిపారు. హరికృష్ణ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా, బుధవారం ఉదయం నల్గొండ జిల్లా అన్నేవర్తి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.












Click it and Unblock the Notifications